ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి ప్రమాదకరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సామాన్యులను ఆదుకునేందుకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కరోనా నిర్మూలనా చర్యలకు రూ.70 లక్షలు విరాళమిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ‘‘పవన్ కల్యాణ్గారి ట్వీట్ చూసి స్ఫూర్తి పొందాను. కరోనా(కోవిడ్ 19) నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.70 లక్షల రూపాయలను అందిస్తున్నాను. కరోనా నివారణకు గౌరవనీయులైన ప్రధాని మంత్రి నరేంద్రమోదీగారు, మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్గారు, జగన్ మోహన్రెడ్డిగారు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. బాధ్యత గల పౌరుడిగా ప్రభుత్వాలు సూచించిన నియమాలను పాటించాలని కోరుతున్నాను’’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు రామ్ చరణ్. తాజాగా ఆయన మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.కరోనా వైరస్ కారణంగా దేశమంతటా లాక్ డౌన్. సినీ పరిశ్రమంతా స్తంభించిపోయింది. ఈ తరుణంలో పేద సినీ కార్మికులను కాపాడటానికి టాలీవుడ్ సినీ ప్రముఖులు ముందుకొచ్చారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ‘కరోనా క్రైసిస్ చారిటీ’(సి.సి.సి)ను ఏర్పాటు చేశారు. చిరంజీవి ఈ విషయాన్ని తెలియజేస్తూ సినీ కళాకారులను ఆదుకోవడానికి ప్రముఖులు ముందుకు రావాలని సూచించారు. సి.సి.సి ద్వారా చిత్ర పరిశ్రమ కార్మికుల సంక్షేమార్థం పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే కేంద్ర, రెండు తెలుగు రాష్ట్రాల సహాయ నిధికి రూ.70 లక్షలు విరాళం ఇచ్చిన మెగాపవర్ స్టార్ రామ్చరణ్ ఇప్పుడు రూ.30 లక్షల విరాళాన్ని సినీ కార్మికుల సహాయ నిధికి అందచేస్తున్నట్లు ప్రకటించారు.