ఎన్నికల సమయంలో కనిపించే సమైక్యత అధికారంలోకి వచ్చాక క్రమక్రమంగా మాయమవడం రాజకీయాల్లో ఏపార్టీకైనా అత్యంత సహజం. అందుకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకొని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ మినహాయింపేమి కాదు.ఎన్నికల్లో గెలిచిన సమయంలో గెలిచామనే ఆనందంలో ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడిప్పుడే అసంతృప్తి బాట పడుతున్నారు.మంత్రివర్గ విస్తరణ నుంచి వైసీపీలో అసంతృప్తి మొదలైంది.మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో అసహనంతో ఉన్న నేతలను బుజ్జగించడానికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడంతో సమస్య మరో మలుపు తీసుకుంది.మంత్రి పదవులు దక్కకపోవడంతో అలకపాన్పు ఎక్కిన ఎమ్మెల్యేలను బుజ్జగిస్తే సరిపోతుందని భావించి జగన్ వారికి మాత్రమే నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు.అయితే ఎన్నికల సమయంలో జగన్పై అభిమానం, గౌరవంతో తమ నియోజకవర్గాల టికెట్లు ఇతరులకు కేటాయించినా మౌనంగా సీట్లు త్యాగం చేసిన నేతలను వైఎస్ జగన్ విస్మరిస్తుండడంతో ఆయా నేతల్లో కొద్దికొద్దిగా అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి.ఎన్నికల సమయంలో సీట్లు త్యాగం చేసినందుకు అధికారంలోకి వచ్చాక పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానంటూ ఇచ్చిన హామీపై వైఎస్ జగన్ మౌనంగా ఉంటుండడం అసంతృప్తికి కారణమైంది.ఒకవైపు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వంటి నేతలకు ఒకటికి రెండు మూడు పదువులు ఇస్తూ ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన తమను విస్మరిస్తున్నారనే అసహనం నేతల్లో మొదలైంది.కాగా సీనియర్ నేతలైన ఆళ్ల రామకృష్ణారెడ్డి,అంబటి రాంబాబు తదితర నేతలు సైతం పదవుల కోసం అవకాశం దొరికిన ప్రతిసారి వైఎస్ జగన్కు గుర్తు చేస్తున్నారు.ఇంతటి తీవ్రమైన పోటీలో ఈ నేతల గోడును వైఎస్ జగన్ పట్టించుకుంటారా?