25న వంగవీటి రాధా పార్టీలో చేరుతున్నారు.. తేల్చిచెప్పిన చంద్రబాబు

25న వంగవీటి రాధా పార్టీలో చేరుతున్నారు.. తేల్చిచెప్పిన చంద్రబాబు

వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా టీడీపీలో చేరడం దాదాపు ఖాయమైంది. కృష్ణా జిల్లాతోపాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి సోమవారం పెద్ద ఎత్తున రాధారంగా మిత్రమండలి సభ్యులు విజయవాడలోని రాధా నివాసానికి తరలివచ్చారు. వారితో ప్రత్యేకంగా భేటీ అయిన రాధా తన రాజకీయ భవిష్యత్తు పై వారితో చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో అత్యధికులు ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీలో చేరడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని జనసేనలో చేరితే బాగుంటుందన్న సూచనలూ వచ్చినట్లు తెలిసింది.మరోవైపు రాధాతో టచ్‌లో ఉన్న టీడీపీ నేతలు ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మొత్తం పరిణామాలను అంచనా వేస్తున్న రాధా టీడీపీవైపు వెళ్లడానికే సుముఖంగా ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అన్నీ అనుకూలిస్తే మంగళ, బుధవారాల్లో ఆయన సీఎం చంద్రబాబును కలిసే అవకాశముంది.. అనంతరం పెద్ద ఎత్తున అనుచరులతో కలిసి టీడీపీలో చేరవచ్చని సన్నిహితులు చెబుతున్నారు. రాధాతో భేటీ అనంతరం రాధారంగా మిత్రమండలి సభ్యులు విలేకరులతో మాట్లాడారు. ‘‘జగన్‌ వైసీపీ టికెట్లను అమ్ముకుంటున్నారు. అందుకే రాధాకు టికెట్‌ను నిరాకరించారు. రానున్న ఎన్నికల్లో రాధారంగా అభిమానులు ఎవరూ వైసీపీకి ఓట్లు వేయవద్దు’’ అని వారు పిలుపునిచ్చారు.జిల్లా నేతలతో సీఎం భేటీతెలుగుదేశంలోకి వంగవీటి రాధా రాకను సీఎం చంద్రబాబు ధ్రువీకరించారు. 25న రాధాకృష్ణ పార్టీలో చేరుతున్నారు. పార్టీ విస్తృత ప్రయోజనాల రీత్యా ఆయనను తీసుకుంటున్నామని, కలుపుకుని వెళ్లాలని జిల్లా నేతలను చంద్రబాబు ఆదేశించారు. సోమవారం రాత్రి మంత్రిమండలి సమావేశం ముగిసిన తరువాత ఆయన విడిగా జిల్లా నేతలతో సమావేశమయ్యారు. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, విజయవాడ నగర అధ్యక్షుడు బుద్దా వెంకన్న, జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యలను పిలిపించుకుని మాట్లాడారు. ముందుగా ‘రాధాను తీసుకోవాలని అనుకుంటున్నాం. మీ అభిప్రాయం చెప్పండి’ అని అడిగారు. నేతలందరూ మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘వంగవీటి రాధాను విస్తృత ప్రయోజనాల దృష్ట్యా తీసుకుంటున్నాం. కలుపుకుని వెళ్లాలి. వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి’’ అని నేతలకు స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు అవినాశ్‌కు న్యాయం చేయాలని బుద్దా వెంకన్న, చంద్రబాబును కోరారు. ‘నేను చూసుకుంటాను. తగిన న్యాయం చేస్తా’ అని సీఎం హామీ ఇచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos