సొంత పార్టీ అభ్యర్థికి ఓటేయొద్దంటూ కాంగ్రెస్ ప్రచారం

సొంత పార్టీ అభ్యర్థికి ఓటేయొద్దంటూ కాంగ్రెస్ ప్రచారం

న్యూ ఢిల్లీ : ఏ రాజకీయ పార్టీ అయినా తన సొంత అభ్యర్థికే ఓటు వేయొద్దని ప్రచారం చేస్తుందా? అసలు అలాంటి సందర్భం ఎప్పుడైనా చోటు చేసుకుందా? గతం సంగేతేమో కానీ.. తాజాగా 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా అలాంటి విచిత్ర పరిణామం వెలుగు చూసింది. రాజస్థాన్లోని గిరిజనులు అధికంగా ఉండే బన్స్వారా-దుంగార్పూర్ లోక్సభ నియోజకవర్గంలో.. తమ అభ్యర్థికి ఓటేయొద్దంటూ కాంగ్రెస్ పార్టీ ఓటర్లను అభ్యర్థిస్తోంది. ఇందుకు ఓ బలమైన కారణం ఉంది. తొలుత ఆ నియోజకవర్గానికి ఏ అభ్యర్థిని ఎంపిక చేయాలన్న విషయంపై కాంగ్రెస్ పార్టీ తర్జనభర్జన పడింది. ఎందరినో పరిశీలించి, కొన్ని మార్పులు చేర్పులు చేసి, ఫైనల్గా తన సొంత అభ్యర్థి అరవింద్ దామోర్ను నిలబెట్టింది. కానీ.. నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీకి ఒక రోజు ముందు అభ్యర్తి విషయంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ షాకిచ్చింది. భారత్ ఆదివాసీ పార్టీ అభ్యర్థి రాజ్కుమార్ రోట్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంది. బీఏపీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది కాబట్టి.. ఆ నిర్ణయానికి అనుగుణంగా దామోర్ తన నామినేషన్ పత్రాల్ని ఉపసంహరించుకోవాల్సి ఉంది. కానీ.. నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ ముగిసే వరకు దామోర్ ఎక్కడా కనిపించలేదు. ఏ ఒక్కరితోనూ కాంటాక్ట్లో లేడు.
తీరా నామినేషన్ ఉపసంహరణ చివరి తేదీ ముగిశాక దామోర్ మీడియా ముందుకొచ్చాడు. అంతకుముందు జరిగిన పరిణామాలపై తనకేమీ తెలియనట్లుగా నటించి.. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ కుండబద్దలు కొట్టాడు. దీంతో.. బీజేపీ , కాంగ్రెస్-బీఏపీ కూటమి మధ్య జరగాల్సిన ద్విముఖ పోటీ కాస్త త్రిముఖ పోరుగా మారింది. దామోర్ పోటీ చేస్తుండటంతో.. కాంగ్రెస్ ఓట్లు చీలే అవకాశం ఉంది కాబట్టి, ఇది బీజేపీ అభ్యర్థి మహేంద్రజిత్ సింగ్ మాల్వియాకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ నేపథ్యంలోనే.. తమ సొంత అభ్యర్థి దామోర్కి ఓటు వేయొద్దని, కాంగ్రెస్-బీఏమీ కూటమి అభ్యర్థి అయిన రాజ్కుమార్కి ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos