కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి సైకిల్ ఎక్కడం దాదాపు ఖరారైంది. కోట్ల వర్గంతో కలిసి పనిచేయండి అని కేఈ కుటుంబానికి చంద్రబాబు సర్ది చెప్పారు. అర్థరాత్రి వరకు కేఈ బ్రదర్స్ కృష్ణమూర్తి, ప్రభాకర్లతో అధినేత చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో కోట్ల వర్గంతో కలిసి పని చేయాలని చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది.అయితే కోట్ల ఫ్యామిలీ చేరికపై తమకు ఉన్న అభ్యంతరాలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు కేఈ బ్రదర్స్.. ముఖ్యంగా డోన్ అసెంబ్లీ సీటు విషయంలో అభ్యంతరాలు చెప్పినట్టు తెలుస్తోంది. సీటు విషయంపై క్లారిటీ ఇవ్వకున్నా.. కర్నూలు జిల్లాలోనూ, పార్టీలోనూ కేఈ కుటుంబానికి ఉన్న గౌరవం ఏమాత్రం తగ్గదని చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు హామీపై పూర్తిగా సంతృప్తి చెందామని కేఈ కృష్ణమూర్తి ప్రకటించారు. అధినేత సూచనల మేరకు కోట్ల కుటుంబంతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు డిప్యూటీ సీఎం కేఈ. జిల్లాలో పార్టీ పటిష్టత కోసం చంద్రబాబు కొన్ని సూచనలు చేశారన్నారు కేఈ ప్రభాకర్.. అధినేత చంద్రబాబు ఆదేశాలు ఏవైనా పాటిస్తామని ప్రభాకర్ స్పష్టం చేశారు.