దిల్లీ: జనరల్ కోటాలోని ఆర్థికంగా వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు సివిల్స్ పరీక్ష రాసేందుకు అదనంగా మరో మూడు అవకాశాలు దక్కే అవకాశం ఉంది. వారికి 10% రిజర్వేషన్లను కల్పిస్తూ పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన బిల్లు చట్టంగా మారిన తర్వాత ప్రభుత్వం ఇందుకోసం చర్యలు తీసుకోనుంది. ప్రస్తుతం సివిల్స్ పరీక్షకు గరిష్ఠ వయోపరిమితి జనరల్ అభ్యర్థులకు 32 ఏళ్లు, ఓబీసీలకు 35 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 37 ఏళ్లుగా ఉంది. జనరల్ అభ్యర్థులు ఆరు సార్లు, ఓబీసీలు తొమ్మిది సార్లకు మించి పరీక్ష రాసే వీలులేదు. జనరల్ కేటగిరీలో ఆర్థికంగా వెనకబడిన వారి వయోపరిమితిని పెంచేందుకు కేంద్రం వచ్చే బడ్జెట్ సమావేశాల్లో మరో బిల్లును తేనున్నట్లు తాజా సమాచారం. ఈ ఉద్దేశంతోనే 14 రోజులపాటు బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నట్లు ప్రకటించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓబీసీలకు వర్తించే నిబంధనలనే జనరల్ కేటగిరీ పేదల విషయంలోనూ పాటించాలని భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి ఒకరు తెలిపారు.