రాబోయే రోజులన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవే అని గిద్దలూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త అన్నా వెంకట రాంబాబు అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక మధుప్రియ రెస్టారెంట్ పైన ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ పటిష్టంగా ఉందని రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి అనడంలో ఏమాత్రం సందేహం లేదన్నారు. పార్టీని గెలిపించుకోవడం కోసం నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్క ఓటరును కలసి పార్టీ అధికారంలోకి రావడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించాలన్నారు. జగన్ను ముఖ్యమంత్రిని చేసుకోవడం ద్వారానే రాష్ట్రంలో పేదప్రజలందరికీ న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వెంకటేశ్వరరెడ్డి, కాకర్ల శ్రీను, నరాళచెన్నారెడ్డి, మాదాసు వసంత, బల్లా చిన్నగురువయ్య, పెద్దయోగయ్య, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీలో చేరిన కాకర్ల వాసులు
అర్థవీడు మండలం కాకర్లకు చెందిన కాసులపాండు, వెన్నా రంగారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ, ఇతర పార్టీలకు చెందిన సుమారు 200 మంది యూత్, ఇతరనాయకులు ఆదివారం రాత్రి కంభంలో జరిగిన సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త అన్నా రాంబాబు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ విజయం కోసం పాటుపడతామని అన్నా రాంబాబు నాయకత్వంలో ముందుకు సాగుతామని తెలిపారు.