ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లో నాలుగు రోజుల లాభాలకు గండిపడింది. కార్పొరేట్ ఫలితాల వెల్లడి, బ్యాంక్ షేర్ల పతనంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించటంతో గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ 100 పాయింట్ల మేర నష్టపోయింది. దీంతోపాటు అంతర్జాతీయంగా సంకేతాలు అనుకూలంగా లేకపోవటం, రూపాయి బలహీనత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో సాగటానికి కారణాలుగా ఉన్నాయని ట్రేడర్లు తెలిపారు. బీఎస్ఈ సెన్సెక్స్ 106.41 పాయింట్ల (0.29 శాతం) నష్టంతో 36150.50 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 33.55 పాయింట్ల (0.31 శాతం) నష్టంతో 10821.60 పాయింట్ల వద్ద క్లోజైంది.
బ్యాంకు షేర్ల ఢమాల్
ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు గురువారం నాడు 2.36 శాతం నష్టపోయాయి. కాగా ఓఎన్జీసీ, మారుతి సుజుకీ, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ, హీరో మోటోకార్ప్, ఐటీసీ, హెచ్సీఎల్ టెక్ షేర్లు కూడా 1.31 శాతం నష్టపోయాయి. మరోవైపు మూడో త్రైమాసిక ఫలితాలు వెల్లడి కారణంగా టీసీఎస్ షేరు ఫ్లాట్గా ముగిసింది. కాగా టాటా మోటార్స్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, యెస్ బ్యాంక్, ఎ అండ్ ఎం, భారతి ఎయిర్టెల్, హెచ్యూఎల్ షేర్లు లాభాల్లో ముగిసాయి.
జోరుకు అడ్డుకట్ట !
కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు మార్కెట్లో కొంత సెంటిమెంట్ను దెబ్బతీశాయని సాంక్టమ్ వెల్త్ మేనేజ్మెంట్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సునీల్ శర్మ తెలిపారు. నాలుగేళ్లుగా తర్వాత కార్పొరేట్ రంగంలో ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారని ఆయన పేర్కొన్నారు. మరోవైపు డాలర్ మారకంలో రూపాయి పతనం కావటంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడవటం, చమురు ధరలు 60 డాలర్ల పైకి చేరుకోవటం వంటి దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించాయని శర్మ తెలిపారవిదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్సీఐ) బుధవారం రూ.276.14 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీఐఐ) రూ.439.67 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్లు బీఎ్సఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.