దిల్లీ: ‘ఖేలో ఇండియా’ ప్రచారంలో భాగంగా కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ మరో కొత్త ఛాలెంజ్కు శ్రీకారం చుట్టారు. దీనికి #5minutAur అని నామకరణం కూడా చేశారు. ఇందుకు సంబంధించి మంత్రి వీడియో ఒకటి పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఆయన రెండు చేతులతోనూ టేబుల్ టెన్నిస్ ఆడుతూ కనిపించారు. ఈ ఛాలెంజ్ ప్రాముఖ్యాన్ని చెబుతూ టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, బాలీవుడ్ నటి దీపికా పదుకొణెలను ట్యాగ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఖేలో ఇండియాలో భాగంగా పుణెలో క్రీడా పోటీలను మంత్రి బుధవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా క్రీడల ప్రాముఖ్యం గురించి చెబుతూ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘ఆటల పట్ల మనకు చిన్నతనంలోనే అభిరుచి ఏర్పడి ఉంటుంది. హోమ్వర్క్ చేసుకోకుండా చిన్నప్పుడు మనం ఆడుకుంటూ ఉంటే అమ్మ మనల్ని వారించేది. వచ్చి హోమ్వర్క్ చేసుకోవాలని హెచ్చరించేది. అప్పుడు మనం ‘ఇంకో ఐదు నిమిషాలే’ అని అనే ఉంటాం. ఇలాంటి అనుభవాలు దాదాపుగా అందరికీ ఎదురయ్యే ఉంటాయి. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఐదు నిమిషాల పాటు క్రీడల గురించి ఆలోచించండి. ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉంటే పంచుకోండి’ అని తెలిపారు.
|