రంగారెడ్డి జిల్లా కోర్టులు: వినియోగదారునికి సేవలు అందించడంలో వైఫల్యం చెందిన ఓలా క్యాబ్ సంస్థ యాజమాన్యంతోపాటు దాని డ్రైవర్ పనితీరుని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం తప్పు పట్టింది. ఫర్యాది కథనం ప్రకారం సరూర్నగర్ హరిపురికాలనీకి చెందిన ఎన్.శ్రీధర్ 2017 మే 27న కేశవ మెమోరియల్ కళాశాలలో జరిగిన ఎల్ఎల్ఎం ప్రవేశ పరీక్షకు హాజరు కావడానికి ఏఎన్ఐ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఓలా క్యాబ్ను బుక్ చేశాడు. బుకింగును ఖాయం చేస్తూ క్యాబ్ నంబరు, డ్రైవర్(సుధీర్) పేరుతో పాటు అతని చరవాణి నంబరు సంక్షిప్త సమాచారం వచ్చింది. పరీక్ష గం.2.30 ఉండడంతో శ్రీధర్ క్యాబ్ డ్రైవర్ సుధీర్ చరవాణికి పలు మార్లు పోన్లు చేసినప్పటికీ రెండు నిమిషాల్లో వస్తున్నానని రాలేదు. చివరికి క్యాబ్ డ్రైవర్ బుకింగును రద్దు చేసినట్లు తెలిపాడు. దీంతో అతడు సరైన సమాయానికి చేరుకోలేక పరీక్ష రాయలేకపోయాడు. క్యాబ్ సంస్థ నిర్లక్ష్యం వల్లే హాజరుకాలేక పోయానని శ్రీధర్ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. బెంగళూరులోని సంస్థ నిర్వాహకుడు, కూకట్పల్లిలోని దాని శాఖ నిర్వాహకుడు, డ్రైవర్ సుధీర్ను ప్రతివాదులుగా చేర్చి కేసు దాఖలు చేశాడు. కేసు విచారించిన ఫోరం ఓలా క్యాబ్ సంస్థ సేవల్లో లోపముందని తేల్చింది. ఫిర్యాదికి రూ.10,000 పరిహారం, కోర్టు ఖర్చులకు రూ.2,000 నెలలోపు చెల్లించాలని ఫోరం ప్రతివాదులను ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.