తిరుపతి: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్నివెంటనే చెల్లించక పోతే ఆందోళనకు దిగుతామని సీనియర్ నటుడు, ప్రయివేటు విద్యా సంస్థల అధినేత మోహన్ బాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం ఇక్కడ మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టారు. కోట్లాదిగా విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే నాకు ఇష్టం. అయినా మాకు ఫీజు బకాయిలు చెల్లించలేదు. ఆయన చాలా సార్లు మా కళాశాలకు వచ్చారు. ప్రయోజనం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు2014 నుంచి 2018 వరకూ రూ.19 కోట్లు పేరుకు పోయాయి. నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు. బకాయిల్ని తీర్చాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రికి లేఖలు రాసాను. 2017-2018లో అమలు చేసిన నూతన నియమావళి ప్రకారం మూడు నెలలకు ఓ సారి ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలి. ఇప్పటివరకూ భిక్షంమాదిరి అంతో ఇంతో ఇస్తున్నారు. ఇలాగైతే విద్యార్థులు ఎలా చదవాలి. అధ్యాపకులకు జీతాలు ఎలా చెల్లించాలి. ఎంత కాలం ఇలా? నాకు ఏ కులం లేదు, నేను అందరివాడిని. నాణ్యత లేని విద్యను బోధించను. రాజకీయం కోసం మాట్లాడటం లేదు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిల బెట్టుకోవాలి. లేకుంటే ఆందోళనతథ్యం’అని హెచ్చరించారు.