కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో సోమవారం ఓ ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా భారత క్రికెట్ జట్టు పేస్ బౌలర్ అశోక్ దిండా ముఖానికి గాయమైంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం బెంగాల్ జట్టు సన్నద్ధమవుతోంది. దిండా వేసిన బంతిని బ్యాట్స్మన్ వివేక్ సింగ్ స్ట్రయిట్ డ్రైవ్గా ఆడాడు. అది నేరుగా వచ్చి దిండా ముఖాన్ని తగిలింది. దీంతో అతను పిచ్ మీదనే కుప్పకూలాడు. నైటింగేల్ ఆస్పత్రికి అతనిని తరలించగా, స్కానింగ్ అనంతరం ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు తెలిపారు. దిండా 13 వన్డేలు, తొమ్మిది టీ20లు ఆడాడు. 2013లో చివరి సారిగా భారత్ తరఫున ఆడాడు. 2009 డిసెంబరు 9న శ్రీలంకతో జరిగిన టీ20లో అరంగేట్రం చేశాడు.