ముంబయి: ఆన్లైన్ గేమ్ పబ్జిపై నిషేధం విధించాలని కోరుతూ 11ఏళ్ల విద్యార్థి బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. అంతకుముందు ఈ విషయంపై మహారాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్కు లేఖ రాసిన ఆ విద్యార్థి.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.అహద్ నిజాం అనే విద్యార్థి తన కుటుంబంతో కలిసి ముంబయిలోని బంద్రాలో నివాసముంటున్నాడు. పబ్జి కారణంగా అనేక మంది విద్యార్థులు హింసకు ప్రేరేపితులవుతున్నారని, దీన్ని వెంటనే నిషేధించాలని కోరుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రమంత్రికి లేఖ రాశాడు. తాజాగా తన తల్లితో కలిసి బాంబే హైకోర్టులో పిటిషన్ వేశాడు. అంతేగాక ఆన్లైన్లో ఇలాంటి హింసను ప్రేరేపించే కంటెంట్ను పరిశీలించడానికి ఓ ఆన్లైన్ ఎథిక్స్ రివ్యూ కమిటీని ఏర్పాటుచేసేలా కేంద్రప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని అహద్ తన పిటిషన్లో పేర్కొన్నాడు.అంతకుముందు జమ్ము కశ్మీర్ విద్యార్థి యూనియన్ కూడా ఈ గేమ్పై నిషేధం విధించాలని ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ను కోరింది. పబ్జి వల్ల విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ పెట్టట్లేదని, తద్వారా పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నారని విద్యార్థి యూనియన్ పేర్కొంది. కాగా.. ఇటీవలే గుజరాత్ ప్రభుత్వం దీనిపై ఆంక్షలు విధించింది. పబ్జిని నిషేధించాలని రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను ఆదేశించింది.