న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తాత్కాలిక డైరెక్టర్గా ఎం నాగేశ్వర రావు నియామకంపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్పై వచ్చే వారం విచారణ జరుపుతుంది. కామన్ కాజ్ అనే ప్రభుత్వేతర సంస్థ, ఆర్టీఐ ఉద్యమకారిణి అంజలి భరద్వాజ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ డైరెక్టర్ నియామక ప్రక్రియలో పారదర్శకత కోసం నిర్దిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎల్ ఎన్ రావు, జస్టిస్ ఎస్ కే కౌల్ కూడా ఉన్నారు. సీబీఐ డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్లను అకస్మాత్తుగా సెలవుపై పంపిన కేంద్ర ప్రభుత్వం జనవరి 10న ఎం నాగేశ్వర రావును ఆ సంస్థకు తాత్కాలిక డైరెక్టర్గా నియమించింది.