దిల్లీ, కోల్కతా, తిరువనంతపురం: దేశవ్యాప్తంగా పది కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మెతొలిరోజైన మంగళ]వారం చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా సాగింది. కేరళ, ఒడిశా, పశ్చిమబెంగాల్లో రోడ్డురవాణా, రైలు సేవలకు ఎక్కువగా అంతరాయం కలిగింది. కర్ణాటకలోని కొన్ని జిల్లాల్లో బంద్ వాతావరణం కనిపించింది. ముంబయి పౌరరవాణా విభాగానికి చెందిన 32వేలమంది ఉద్యోగులు సమ్మె చేయడంతో సుమారు 25లక్షలమంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. మరోవైపు సమ్మెలో పాల్గొంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కేంద్రప్రభుత్వం హెచ్చరించింది. కేరళలో పాఠశాలలు, కళాశాలలు మూసేశారు. పశ్చిమబెంగాల్లో ఆందోళనకారులు విధ్వంసాలకు పాల్పడ్డారు. రాజస్థాన్లోని జపాన్ కంపెనీ ఆవరణలోకి ప్రవేశించి సమ్మెలో పాల్గొనాలని కార్మికులకు నచ్చజెప్పడానికి వెళ్తున్నవారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో 22మంది పోలీసులు, 50మంది ఆందోళనకారులు గాయపడ్డారు.