దిల్లీ: భారతీయులు తమ కార్లు తెలుపు రంగులో ఉండాలనే కోరుకుంటున్నారట. 2018లో 43 శాతం మంది ఆ రంగునే ఎంచుకున్నారట. జర్మనీకి చెందిన రసాయన సంస్థ బీఏఎస్ఎఫ్ తన అధ్యయనంలో ఈ విషయాలను వెల్లడించింది. ఆ కంపెనీ ‘బీఏఎస్ఎఫ్ కలర్ రిపోర్ట్ ఫర్ ఆటోమోటివ్ ఓఈఎం కోటింగ్స్’ పేరుతో ఓ నివేదికను వెలువరించింది. తెలుపు తరువాత గ్రే(15శాతం), సిల్వర్(15శాతం) రంగులను ఎంపిక చేసుకున్నారని వెల్లడించింది. తరవాత స్థానాల్లో ఎరుపు(9శాతం), నీలం(7శాతం), నలుపు(3శాతం) రంగులను ఎంపిక చేసుకున్నారు. ‘భారతీయ కొనుగోలు దారులు ముత్యపు రంగు(పర్ల్ వైట్)నే ఎంచుకుంటున్నారు. ఇక్కడి వాతారణం వేడిగా ఉండటం కూడా ఈ రంగును ఎంచుకోడానికి కారణం. తెలుపు రంగు వల్ల కార్లు త్వరగా వేడెక్కవు. అలాగే ఆ రంగు విలాసవంతంగా కనిపించడం కూడా ఓ కారణం కావొచ్చు’ అని బీఏఎస్ఎఫ్ హెడ్ ఆఫ్ డిజైన్స్ చిహారు మత్సుహారా వెల్లడించారు. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్(ఎస్యూవీ) కార్ల విషయంలో కూడా 41 మంది ఈ రంగు వైపే మొగ్గు చూపుతున్నారు. అలాగే కాంపాక్ట్ సెగ్మెంట్, కాంపాక్ట్ ప్రీమియమ్ సెగ్మెంట్ల విషయంలో కూడా తెలుపుదే పైచేయి. అయితే మిడ్ సైజ్డ్ సెగ్మెంట్ లో మాత్రం నలుపు రంగు రెండో స్థానాన్ని ఆక్రమించిందని వెల్లడించింది.