తమిళనాడులో ఉచిత భోజనం పథకం
చెన్నై: ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీగా ఉచిత వరాలు కురిపించడం తెలిసిందే. బియ్యం, సైకిళ్లు, ల్యాప్టాప్, మిక్సర్ గ్రైండర్, ఫ్యాన్లు ఇలా ఎన్నింటినో ఉచితంగా అందిస్తామని హామీలు ఇస్తాయి. ఈ విషయంలో తమిళనాడు ఒక అడుగు ముందే ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది అక్కడి ప్రభుత్వం. ఉచితాల జాబితాలోకి ఉచిత భోజనం వచ్చి చేరింది.
నమోదు చేసుకున్న నిర్మాణ రంగ కార్మికులకు త్వరలో అమ్మ క్యాంటీన్లలో ఉచిత భోజనం సదుపాయం కల్పిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి కె. పళనిస్వామి ప్రకటించారు. శాసన సభ సమావేశం సందర్భంగా గవర్నర్ భన్వర్లాల్ పురోహిత్కు ధన్యవాద తీర్మానం అనంతరం ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమ్మ క్యాంటీన్లలో ఇప్పటికే అత్యధిక సబ్సిడీతో భోజనం అందిస్తోన్న సంగతి తెలిసిందే. సాంబారు రైస్ రూ.5, పెరుగన్నం రూ.3, ఒక ఇడ్లీ రూ.1 కి వడ్డిస్తున్నారు.