దావోస్: భారత్లో జీఎస్టీ అమలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ పేర్కొన్నారు. ఆమె దావోస్లో ఒక ఆంగ్ల వార్త ఛానల్తో మాట్లాడుతూ ‘‘భారత్లో పరోక్ష పన్నుల వసూళ్లు అంచనాల కంటే తక్కువ వసూలు అవుతున్నాయి. ఇది జీఎస్టీ తీసుకు రావడంలో గానీ లేక అమల్లోగానీ ఉన్న లోపాలకు సంకేతం. వాటిని పరిష్కరించాల్సి ఉంది. దీంతోపాటు వ్యవసాయ రంగం కూడా తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఇక్కడ కూడా చేయాల్సింది ఎంతో ఉంది. ఇది రుణ మాఫీ రూపంలో ఉండకూడదు. నగదు మద్దతు అవసరమే కానీ అది ఇన్పుట్ సబ్సిడీల రూపంలో ఉండాల్సిన అవసరం లేదు.’’ అని పేర్కొన్నారు.ప్రభుత్వం రైతులకు నగదు రూపంలో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్న సమయంలో గీతా గోపీనాథ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రభుత్వం కనుక రైతులకు ఇన్పుట్ సబ్సిడీని నగదు రూపంలో ఇస్తే రూ.70వేల కోట్ల వరకు అదనపు నిధులు అవసరం అవుతాయని పేర్కొన్నారు. భారతీయ ఆర్థిక వ్యవస్థ పనితీరుపై ఆమె ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రపంచ ఆర్థిక వృద్ధి మాత్రం నెమ్మదించి 3.5శాతం మాత్రమే ఉంటుందని ఐఎంఎఫ్ పేర్కొంది.