న్యూఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి జార్జి ఫెర్నాండెజ్ (88) తీవ్ర అస్వస్ధతతో మంగళవారం ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా ఆయన స్వైన్ఫ్లూతో బాధపడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఫెర్నాండెజ్ మంచానికే పరిమితమయ్యారు. 1930 జూన్ 3న మంగుళూరులో జన్మించిన జార్జి మ్యాథ్యూ ఫెర్నాండెజ్ 1967లో తొలిసారిగా లోక్సభకు ఎన్నికయ్యారు. దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి కేబినెట్లో రక్షణ మంత్రిగా పనిచేసిన ఫెర్నాండెజ్ సమాచార శాఖ, రైల్వే, పరిశ్రమలు వంటి పలు మంత్రిత్వ శాఖలను నిర్వహించారు.జనతాదళ్ నేతగా పేరొందిన ఫెర్నాండెజ్ వీపీ సింగ్ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా వ్యవహరించారు. మాతృసంస్ధ జనతాదళ్ను వీడిన అనంతరం ఆయన బీజేపీతో చేతులు కలిపారు. 1994లో సమతా పార్టీని స్ధాపించిన ఫెర్నాండెజ్ ఎన్డీఏలో భాగస్వామిగా బీజేపీతో కలిశారు. ఎన్డీఏలో కీలక నేతగా ఎదిగిన ఫెర్నాండెజ్ వాజ్పేయికి అత్యంత విధేయుడిగా పేరొందారు. ఫెర్నాండెజ్ రక్షణ మంత్రిగా ఉన్న సమయంలోనే కార్గిల్ యుద్ధం, పోఖ్రాన్ అణుపరీక్షలను భారత్ విజయవంతంగా చేపట్టింది. ఫెర్నాండెజ్ను పలు వివాదాలు చుట్టుముట్టిన సందర్భాల్లో వాజ్పేయి ఆయనకు వెన్నంటి నిలిచారు.
ఫెర్నాండెజ్ ప్రస్ధానం సాగిందిలా..
జార్జి ఫెర్నాండెజ్ స్వస్థలం మంగళూరు. క్యాథలిక్ కుటుంబంలో పుట్టిన ఫెర్నాండెజ్మంగళూరులో ఎస్ఎస్ఎల్సీ వరకూ చదివిన ఫెర్నాండెజ్ మెట్రిక్యులేషన్ తర్వాత తన చదువును కొనసాగించలేదు.
మతాధికారిగా శిక్షణ తీసుకున్నారు. ద్యోగం కోసం 1949లో ముంబయి వెళ్లిన ఆయన అప్పట్లో ఉద్యోగం దొరకక, సరైన సంపాదన లేక రోడ్లపైనే నిద్రించాల్సి వచ్చింది. ‘రాత్రిపూట విధుల్లో ఉండే పోలీసులు అర్థరాత్రి వచ్చి నన్ను నిద్రలేపేవాళ్లు’ అని ఆయన తన అనుభవాలను పంచుకున్నారు.తర్వాత ఒక వార్తా పత్రికలో ప్రూఫ్ రీడర్గా ఉద్యోగం సంపాదించారు.1950 నుంచి 1961 వరకు ఆయన ముంబయిలో కార్మికుల తరపున పలు ఉద్యమాలు చేశారు. కార్మికుల నాయకుడిగా ఎదిగారు. 1961 నుంచి 1967 వరకు బాంబే మున్సిపల్ కార్పొరేషన్ సభ్యుడిగా పనిచేశారు.అలా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1967 సార్వత్రిక ఎన్నికల్లో సంయుక్త సోషలిస్టు పార్టీ తరఫున దక్షిణ బాంబే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్ఏ పాటిల్పై విజయం సాధించి తొలిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. అయితే ఈ ఎమర్జెన్సీని వ్యతిరేకించిన ఫెర్నాండెజ్ జైలుకు వెళ్లారు. ఎమర్జెన్సీ సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లిన ఫెర్నాండెజ్ 1976లో బరోడా డైనమైట్ కేసులో అరెస్టయ్యారు. ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత 1977లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. ఆ సమయంలో జైలులో ఉన్న ఫెర్నాండెజ్ అక్కడి నుంచే పోటీ చేశారు. జనతా పార్టీలో చేరి బిహార్లోని ముజఫర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1977 లోక్సభ ఎన్నికల్లో జనతా పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కాంగ్రెస్ను గద్దెదింపింది. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఫెర్నాండెజ్కు పరిశ్రమల శాఖ బాధ్యతలు అప్పగించారు.
.1977లో బిహార్లోని ముజఫర్పూర్ నుంచి గెలిచి, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు.1989-90లో ప్రతిష్టాత్మక కొంకణ్ రైల్వే ప్రాజెక్టు కోసం రైల్వే మంత్రిగా విశేష కృషి చేశారు. బరాక్ మిస్సైల్ కుంభకోణం, తెహెల్కా వివాదాల్లో ఆయన పేరు వినిపించింది 1988లో జనతా పార్టీ నుంచి జనతా దళ్ విడిపోయింది. అప్పుడు ఫెర్నాండెజ్ కూడా జనతా దళ్లో చేరి వీపీ సింగ్ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత జనతాదళ్ నుంచి కూడా విడిపోయి సమతా పార్టీని స్థాపించారు. 1998-2004 మధ్య వాజ్పేయీ హయాంలో రక్షణమంత్రిగా వ్యవహరించారు. భారత్-పాక్ మధ్య కార్గిల్ యుద్ధం ఈయన రక్షణమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. 2004లో శవపేటికల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొని రక్షణమంత్రి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. చివరిసారిగా 2009-2010 మధ్య రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన ఫెర్నాండెజ్ ఆ తర్వాత అనారోగ్య కారణాల రీత్యా ప్రజా జీవితానికి దూరంగా ఉన్నారు.
1
అమరావతి: కేంద్రమాజీ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలిపారు. చట్టసభల్లో కార్మికుల గళాన్ని వినిపించిన నేత జార్జి ఫెర్నాండెజ్ అని అన్నారు. దేశంలో ట్రేడ్ యూనియన్ ఉద్యమ నిర్మాతల్లో ఫెర్నాండెజ్ ఒకరని ఆయన తెలిపారు. ఎమర్జెన్సీని ఎదిరించి పోరాడిన యోధుడు జార్జి ఫెర్నాండెజ్ అని కొనియాడారు. నిరాడంబరతకు, నిజాయితీకి నిదర్శనం ఫెర్నాండెజ్ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మాజీ కేంద్ర మంత్రి జార్జి ఫెర్నాండెజ్ (88) స్నేహితుడు, బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి, తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎమర్జెన్సీ టైంలో ఫెర్నాండెజ్ను చూస్తే.. ఇందిరా గాంధీ విపరీతంగా భయపడేవారన్నారు సుబ్రమణ్య స్వామి. ఆయన మాట్లాడుతూ.. ‘గాంధీ కుంటుంబం అంటే ఫెర్నాండెజ్కు అసలు ఇష్టం ఉండేది కాదు. ఆ కుటుంబం దేశాన్ని నాశనం చేస్తుందని ఆయన నమ్మేవాడు. ఆయన తన జీవితాంతం కాంగ్రెస్ను, గాంధీ కుటుంబాన్ని వ్యతిరేకించాడు’ అని తెలిపారు.
ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణయాలను ఫెర్నాండెజ్ తీవ్రంగా వ్యతిరేకించేవాడన్నారు. ‘ఆ సమయంలో ఫెర్నాండెజ్ను చూస్తే ఇందిరా గాంధీ భయపడేవారు. ఆయనను అరెస్ట్ చేసిన తర్వాతే ఇందిరా గాంధీ ప్రశాంతంగా ఉండగలిగార’ని తెలిపాడు సుబ్రమణ్య స్వామి. అంతేకాక తమ అనుబంధం గురించి మాట్లాడుతూ.. ‘ఫెర్నాండెజ్ నాకు చాలా ప్రియమైన స్నేహితుడు. మేం తరచుగా కలుసుకుని పలు అంశాల గురించి చర్చించేవాళ్లం. అతను చాలా తెలివైన వాడు. అతడు తన జీవితంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎన్నో గొప్ప ర్యాలీలు, సభలు నిర్వహించాడ’ని తెలిపారు. ఫెర్నాండెజ్ బోఫోర్స్ కేసును ఓ కొలిక్కి తీసుకురావాలనిభావించారు. వాజ్పేయ్ సూచన మేరకు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారన్నారు సుబ్రమణ్య స్వామి. సైనికులు క్షేమం గురించి ఫెర్నాండెజ్ కన్నా ఎక్కువగా ఏ రక్షణశాఖ మంత్రి కృషి చేయలేదని ప్రశంసించారు.
ADVERTISEMENT