పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలని వదలిపెట్టి రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రతి రోజూ రాజకీయ కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జనసేన పార్టీని సిద్ధం చేసేందుకు పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్ లో వ్యూహాలు రచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న కార్యక్రమాలు చాలా విన్నూత్నంగా ఉంటున్నాయనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. హీరో మంచు మనోజ్ తాజాగా ట్విట్టర్ లో జనసేన పార్టీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇటీవల జనసేన పార్టీలోకి చేరికలు ఎక్కువయ్యాయి. పవన్ కళ్యాణ్ ఒక్కొక్కరిగా ప్రముఖులందరిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇటీవల జనసేన పార్టీలో చేరిన వారంతా విద్యావంతులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నత స్థానాల్లో అధికారులుగా ఉన్నవారు కావడం విశేషం. మాజీ పోలీస్ అధికారులు, మాజీ ఐఏయస్ అధికారులు, సీనియర్ జర్నలిస్టులు జనసేన పార్టీలో ఇటీవల చేరారు. హీరో మంచు మనోజ్ కామెంట్ చేసింది ఈ అంశం గురించే.
విద్యావేత్తలంతా ప్రజా సేవ చేసేందుకు ముందుకు రావడం రాజకీయాలకు, ఆ పార్టీకి గొప్ప విలువ చేకూర్చే అంశం అని మంచు మనోజ్ అభిప్రాయపడ్డాడు. పవన్ కళ్యాణ్ సర్ ని ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. విద్యావేత్తలకు తన పార్టీలో మంచి స్థానం కల్పించడం ద్వారా జనసేన పార్టీ గౌరవాన్ని, నమ్మకాన్ని పొందిందని మనోజ్ ట్విట్టర్ లో అభిప్రాయ పడ్డాడు. ఈ సందర్భంగా జనసేన పార్టీలో చేరిన వారి ఫోటోలని పోస్ట్ చేశాడు.
మనోజ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉన్నాడో ఇటీవల అతడు చేస్తున్న ట్వీట్స్ చూస్తే అర్థం అవుతుంది. సినీ హీరో అయినప్పటికీ రాజకీయ, సామాజిక అంశాలపై మనోజ్ తరచుగా స్పందిస్తూ తన అభిప్రాయాలని అభిమానులతో పంచుకుంటుంటాడు. మనోజ్ ట్వీట్స్ నెటిజన్ల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది.