ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన సంచలన
ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకపంనలు సృష్టిస్తోంది.ఆంధ్రప్రదేశ్
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై అగ్గిమీద గుగ్గిలంలా విరుచుకుపడే చంద్రబాబు తాజాగా జగన్తో
పొత్తు పెట్టుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది.కేంద్ర
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో చేపట్టిన ధర్మపోరాట దీక్ష చేస్తున్న చంద్రబాబు
ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసారు.ఎన్నికలు ముగిసిన తర్వాత జగన్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు తనకేమీ ఇబ్బంది లేదని చంద్రబాబు పేర్కొన్నారు. *వచ్చే ఎన్నికల్లో జగన్ ఒకటో – రెండో సీట్లు గెలుస్తారు కదా. ఆ తర్వాత రమ్మనండి. మాకు మద్దతుగా నిలబడమనండి. నాకేమీ అభ్యంతరం లేదు. అయినా ఇందులో తప్పేముంది* అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన నేపథ్యంలో జగన్ పై చంద్రబాబు చేస్తున్న విమర్శలు జనం చెవుల్లో పదే పదే మారుమోగిపోతున్నాయి. ఏపీకి అన్యాయం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి సహకరిస్తున్న జగన్ తాను కూడా రాష్ట్రానికి అన్యాయం చేసినట్టేనని చంద్రబాబు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధానితో పాటు ఏ పార్టీ నేతపై విమర్శలు సంధించినా.. జగన్ నామస్మరణ లేకుండా చంద్రబాబు ప్రసంగం ముగించడం లేదు.సమయం ఏదైనా – సందర్భం ఏదైనా కూడా జగన్ ను విమర్శించనిదే చంద్రబాబుకు పొద్దు పోవడం లేదన్న మాట కూడా వినిపిస్తోంది. ఇక జగన్ తో పొత్తుకు సిద్ధమేనని ప్రకటించిన సందర్భంగానూ చంద్రబాబు… ఆయనపై విమర్శలు గుప్పించారు. జగన్ ఇప్పటికీ బీజేపీకి సాయం చేస్తున్నారని ఆరోపించిన చంద్రబాబు… నిన్న గుంటూరులో జరిగిన మోదీ సభకు వచ్చిన జనాలను జగనే తరలించారని కూడా చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి ఏమాత్రం బలం లేదని – ఈ క్రమంలో బీజేపీ సభకు అంతమంది జనం వచ్చారంటే… జగన్ సహకారంతోనేనని కూడా బాబు ఆరోపించారు. మొత్తంగా జగన్ పై ఆరోపణలు సంధిస్తూనే…. ఆయన పార్టీతో పొత్తుకు తనకేమీ ఇబ్బందేమీ లేదని అయినా ఇందులో తప్పేముందని చంద్రబాబు చేసిన ప్రకటన ఇప్పుడు నిజంగానే సంచలనంగా మారిపోయిందని చెప్పాలి.