కడప జిల్లాకు సంబంధించిన రాజంపేట, జమ్మలమడుగు నియోజకవర్గాల తెదేపా నేతల పంచాయతీ సీఎం నివాసానికి చేరింది. రెండు నియోజకవర్గాల విషయమైన చర్చించేందుకు జిల్లా నేతలు పెద్దఎత్తున సీఎం చంద్రబాబు నివాసానికి వచ్చారు. పార్టీని వీడేందుకు ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి సిద్ధమయ్యారనే ప్రచారంతో తలెత్తిన రాజంపేట వివాదం.. జిల్లా నేతల మధ్య పరస్పర విమర్శలకు దారితీసింది. దీనికి సంబంధించి ఇవాళ పార్టీ అధినేత కీలక నిర్ణయం తీసుకోనున్నారు.మరోవైపు జమ్మలమడుగు శాసనసభ స్థానం నుంచి పోటీ చేసే విషయమై మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మధ్య గత కొంత కాలంగా వివాదం సాగుతోంది. ఇద్దరిలో ఒకరికి కడప ఎంపీ టికెట్ కేటాయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అధినేత మాటకు కట్టుబడి ఉంటామని వారిద్దరూ చెబుతున్నా.. ఏ ఒక్కరూ కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు మాత్రం ముందుకు రావడంలేదు. ఇప్పటికే మూడుసార్లు జమ్మలమడుగు పంచాయతీపై చర్చ జరగ్గా.. ఇవాళ మరోమారు సీఎం వద్ద కొనసాగనుంది.