కోటి విలువైన ఫోన్లను ఎలా కొట్టేశారో చూడండి!
జగిత్యాల: జగిత్యాల పట్టణ పోలీస్స్టేషన్కు కూత వేటు దూరంలో బుధవారం వేకువజామున భారీ చోరీ జరిగింది. బోలెరో వాహనంలో వచ్చిన దుండగులు రెండు సెల్ఫోన్ దుకాణాల్లో చొరబడి కోటి రూపాయలు విలువ చేసే సెల్ఫోన్లను అపహరించుకుపోయారు. దీనికి సంబంధించి సీసీ ఫుటేజీ లభ్యమైంది. ఇందులో నలుగురు దుండగులు చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ముఖానికి చేతి రుమాళ్లు ధరించి చాకచక్యంగా ఈ చోరీకి పాల్పడ్డారు. జగిత్యాలలోని యావర్ రోడ్డులోని ఉన్న భవాని, లాట్ మొబైల్ దుకాణాల్లో ఈ చోరీ జరిగింది. దుండగులు మరికొన్ని దుకాణాల్లోనూ చోరీకి విఫలయత్నం చేశారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన దొంగల ముఠా పనేనని పోలీసులు భావిస్తున్నారు.