కేసు వెనక్కి తీసుకోలేదని అత్యాచార బాధితురాలిని కాల్చి చంపిన అత్యంత దారుణ ఘటన హరియాణాలోని గుడ్గావ్లో జరిగింది. సందీప్ కుమార్ అనే బౌన్సర్ డ్యాన్సర్గా పనిచేస్తున్న మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించి కోర్టులో ఆమె వాంగ్మూలం నమోదు చేయాల్సి ఉండగా.. అంతకంటే ముందే నిందితుడు ఆమెను కాల్చి చంపేశాడు. శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. మహిళపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిగినట్లు తెలిపారు.
బాధితురాలి మృతదేహం గుడ్గావ్-ఫరీదాబాద్ ఎక్స్ప్రెస్వే వద్ద కుష్బూ చౌక్ సమీపంలో లభ్యమైంది. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు ఫోన్ చేయడంతో విషయం వెలుగుచూసింది. 2017 మార్చిలో తన కుమార్తె.. సందీప్పై అత్యాచారం కేసు పెట్టిందని, అప్పటి నుంచి అతడు కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నాడని బాధితురాలి తల్లి తెలిపారు. శుక్రవారం కోర్టులో వాంగ్మూలం ఇవ్వాల్సి ఉందని, అయితే ఉదయం సందీప్ ఇంటికి వచ్చి నా కుమార్తెతో కొద్దిసేపు కార్లో కూర్చొని మాట్లాడాలని అడిగాడని, ఆమె కారు ఎక్కగానే తీసుకొని వెళ్లిపోయాడని చెప్పారు. తర్వాత తనకు ఫోన్ చేసి కేసు వెనక్కి తీసుకోకపోతే కుమార్తెను చంపేస్తానని బెదిరించాడని ఆమె చెప్పారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.