హైదరాబాద్ : దేశంలోని రైతులతో పోలిస్తే తెలంగాణ రైతులు అదృష్టవంతులు. మోదీ ప్రభుత్వం ఇవాళ బడ్జెట్లో దేశవ్యాప్తంగా రైతు బంధు పథకాన్ని ప్రకటించింది. ఇది మన తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న రైతు బంధుతో పోలిస్తే చాలా చిన్నది. కేంద్రం ప్రకటించిన రైతుబందు.. ఒక రైతుకు సంవత్సరానికి కేవలం 6 వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తుంది. ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అది కూడా మూడు వాయిదాల్లో 2 వేల చొప్పున రైతు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు.తెలంగాణ రైతు బంధుకు, కేంద్రం రైతు బంధుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఏడాదికి సుమారు రూ.15 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నది. అదే కేంద్రం రైతులకు ఇచ్చేది దేశవ్యాప్తంగా 75 వేల కోట్ల రూపాయలు. అందుకే మిగతా రాష్ట్రాల రైతులతో పోలిస్తే తెలంగాణ రైతులు అదృష్టవంతులు అని చెప్పాలి. తెలంగాణలో వచ్చే అర్థిక సంవత్సరం నుంచి రైతు బందు కింద ఎకరాకు రూ. 10వేలు ఇస్తారు. దీనికి అదనంగా కేంద్ర రైతు బంధు(కిసాన్ సమ్మాన్ నిధి) కింద మరో 6వేల రూపాయలు(ఐదుఎకరాల లోపు ఉన్నవారికి) జమ అవుతున్నాయి. మొత్తం మీద దేశవ్యాప్తంగా రైతులకు నేరుగా ఆర్థిక సహాయం చేయడం ఎంతో కొంత ఊరటనిచ్చే విషయం.