ముంబయి: బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. కర్ణిసేన సంఘానికి చెందిన కార్యకర్తలను హెచ్చరించారు. కంగన ప్రధాన పాత్రలో నటించిన ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ చిత్రం 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాను ఆపాలంటూ మహారాష్ట్రకు చెందిన కర్ణిసేన సంఘ కార్యకర్తలు ఎప్పటినుంచో ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు విడుదల తేదీ దగ్గరపడుతున్న సమయంలో కర్ణిసేన చిత్రబృందాన్ని మరోసారి హెచ్చరించింది. ‘మణికర్ణిక’ చిత్రంలో లక్ష్మీబాయి ఓ బ్రిటిష్ వ్యక్తితో ప్రేమలో పడినట్లు చూపించారని, ఆ సన్నివేశాలను తొలగించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీనిపై కంగన మీడియా ద్వారా స్పందిస్తూ.. ‘మణికర్ణిక సినిమాకు నలుగురు చరిత్రకారులు ఆమోదం తెలిపారు. సెన్సార్ బోర్డు కూడా సర్టిఫికేట్ జారీ చేసింది. ఇప్పటికీ కర్ణిసేన ఆందోళనలు ఆపకపోతే నేను కూడా వారిలాగే ప్రవర్తించాల్సి ఉంటుంది. నేను రాజ్పుత్ను. వారందరినీ నాశనం చేస్తాను’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బాలీవుడ్ నటి దీపిక పదుకొణె నటించిన ‘పద్మవాత్’ చిత్రాన్ని కూడా కర్ణిసేన సంఘాలు వ్యతిరేకించాయి. క్షేత్రస్థాయిలో ఆందోళనలు చేపట్టాయి. కానీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో సినిమా విడుదలకు నోచుకుని విజయాన్ని అందుకుంది.