కదులుతోన్న రైలులోనూ ఖాళీ బెర్తుల వివరాలు.. తొలిసారి అందుబాటులోకి!

కదులుతోన్న రైలులోనూ ఖాళీ బెర్తుల వివరాలు.. తొలిసారి అందుబాటులోకి!

ఇప్పటి వరకూ రైలు కదిలే సమయానికి ఖరారైన రిజర్వేషన్‌ బెర్తుల పట్టిక మాత్రమే అందుబాటులో ఉండేది. తొలిసారిగా ఈ విధానం దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది.రైలు బయలుదేరడానికి రెండు గంటల ముందే రిజర్వేషన్ చార్ట్ ఖరారయ్యే విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ రైలు కదిలే సమయానికి ఖరారైన రిజర్వేషన్‌ బెర్తుల పట్టిక మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ, ఇకపై రైలు బయలుదేరిన తర్వాత కూడా ఖాళీ బెర్తుల వివరాలను తెలుసుకోవచ్చు. ఈ విధానం తొలిసారిగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అమలుచేస్తున్నారు. రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన హ్యాండ్‌ హెల్డ్‌ టర్మినల్స్‌ వ్యవస్థ ద్వారా రైలు బయలుదేరిన తర్వాత బెర్తుల వివరాలను తెలుసుకోవడం సాధ్యమవుతుంది. డిజిటల్‌ ఇండియా మిషన్‌లో భాగంగా ఈ వ్యవస్థను దక్షిణ మధ్య రైల్వేలో డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ అమిత్‌ వరదాన్‌ గురువారం ప్రారంభించారు. ఇక నుంచి టీసీలు హెచ్‌హెచ్‌టీ పరికరాల ద్వారా టికెట్ల తనిఖీని నిర్వహించనున్నారు. వివిధ స్టేషన్ల మధ్య ఖాళీగా ఉన్న బెర్తుల వివరాలను దీని ద్వారా తెలుసుకుని నిరీక్షణ జాబితాలో ముందు వరుసలో ఉన్నవారికి కేటాయించవచ్చు. సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరే నాలుగు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోని సిబ్బందికి 40 హెచ్‌హెచ్‌టీ పరికరాలను అందజేశారు. దీని వల్ల మోసాలను కూడా అరికట్టవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఈ విధానంతో ముఖ్యంగా ఖాళీ బెర్తుల కేటాయింపులో పారదర్శకత ఉంటుందని, ఎప్పటికప్పుడు ఈ వివరాలు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వీటితోపాటు భోజనం, బెడ్ రోల్స్ కూడా వివరాలు కూడా తెలుసుకోవచ్చని వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos