అమరావతి: నరేంద్ర మోదీ విధి నిర్వహణలో దారుణంగా విఫలమైన ప్రధానిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. శనివారం ఆయన ఇక్కడి నుంచి తెదేపా నేతలతో టెలీ కాన్ఫరెన్స్ జరపారు. భాజపా నమ్మక ద్రోహంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయని, దేశంలో ఏ ప్రధానికి ఇంత పెద్ద ఎత్తున నిరసనలు ఎదురు కాలేదని పేర్కొన్నారు. మోదీకి దేశభక్తి కంటే రాజకీయ భక్తి ఎక్కువని ఎద్దేవా చేసారు. దేశ భద్రత కంటే రాజకీయ భద్రతే మోదీకి ముఖ్యమని తప్పు బట్టారు. ‘తప్పుడు పనులు మీరు చేసి మాపై నిందలు వేస్తారా’ అని ప్రశ్నించారు. స్వార్థం, ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం భాజపా ఎంతకైనా దిగజారేందుకు వెనుకంజ వేయబోదని దుయ్యబట్టారు. ‘అప్పుడు స్కామాంధ్ర కావాలా?, స్కీమాంధ్ర కావాలా? అన్నారు. ఇప్పడు స్కామ్లు చేసే వారితో మోదీ, అమిత్ షా ఏకమయ్యారు. ఐదేళ్లయినా జగన్ అవినీతిపై చర్యలు లేవు. బీజేపీ నేతలు అంటకాగుతోంది. కుటుంబమే లేని మోదీ నా కుటుంబాన్ని నిందిస్తున్నారు. వైసీపీకి మేలు చేసేందుకే తెదేపా పై విమర్శలు చేస్తున్నార’ని ధ్వజ మెత్తారు. ఆంధ్ర ప్రదేశ్లో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. సైబర్ నేరగాళ్లంతా కుమ్మక్కై ఓటర్ల జాబితా నుంచి తెలుగు దేశం పార్టీ అభిమానులు, సానుభూతి పరులు, కార్యకర్తల పేర్లు తొలగించే పన్నాగాలు పన్నినట్లు మండి పడ్డారు. వైసీపీనేర పూరిత, చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని ఈసడించారు. రాష్ట్రాన్ని మరో బీహార్ చేద్దామనే కుట్రను చిత్తు చేయాలని పిలుపునిచ్చారు. మోదీ కన్సల్టెంట్ బిహారీ ప్రశాంత్ కిషోర్నూ జగన్ కూడా సలహాదారుగా నియమించుకోవటం వారి దుర్భుద్ధికి అద్దం పడుతుందని చెప్పారు.