దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికైతే ఎలాంటి రుణమాఫీ చేసే అంశాన్నీ పరిశీలించడం లేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి శివప్రతాప్ శుక్లా తెలిపారు. రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానంగా మంత్రి స్పందించారు. ఇటీవలి ఎన్నికలు ముగిసిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు వ్యవసాయ రుణాల మాఫీని ప్రకటించాయి. గతంలో ఇదేతరహా రుణమాఫీల్ని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వ్యవసాయ రంగంలో సంక్షోభాన్ని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన ఒత్తిడి కేంద్రంపై పెరిగింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు త్వరలోనే ఆదాయ మద్దతు పథకాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.