పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వల్ల వృద్ధిపై ప్రభావం
కోయంబత్తూర్: పసిడి ఆభరణాల రంగ వృద్ధి గత రెండేళ్లుగా నిలిచిపోయిందని, ఇందుకు పెద్దనోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కారణమని జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) ఛైర్మన్ అనంత్ పద్మనాభన్ అన్నారు. బంగారు ఆభరణాల కొనుగోలును దీర్ఘకాల పెట్టుబడిగా పాతతరం వారు భావించడం వల్ల మిగులు నిధులున్నపుడల్లా సమీకరించేవారన్నారు. అయితే యువత మాత్రం పర్యటనలు, వాహనాల కొనుగోలుకు నిధులు వెచ్చిస్తూ, ఆభరణాలపై అంతగా మొగ్గుచూపడం లేదని తెలిపారు. బంగారం దిగుమతిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో మన దేశం ఉన్నా, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు తరవాత దేశంలో ఆభరణాల పరిశ్రమ వృద్ధి స్తంభించిందని వివరించారు. దేశీయంగా వినిమయం ఎంత ఉందో కచ్చితమైన గణాంకాలు లేకున్నా, ఈ ఏడాది ఆరంభం నుంచి పసిడి దిగుమతుల్లో ప్రతికూల వృద్ధి నమోదవుతోందనే సమాచారం ఉందన్నారు. దేశీయంగా ఆభరణాల తయారీని ప్రోత్సహించేందుకు 3 రోజుల కార్యక్రమాన్ని సంఘం ఇక్కడ నిర్వహిస్తోంది.