పనిమనిషికి 21 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించారు
ఫ్లోరిడా: ఆదివారాలు పనిచేయించుకున్నందుకు గానూ ఓ హోటల్ పనిమనిషికి 21 మిలియన్ డాలర్లకు పైగా జరిమానా కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. వివరాల్లోకెళితే.. హైతీకి చెందిన మేరీ జాన్ అనే మహిళ ఫ్లోరిడాలోని మియామీ నగరానికి వలస వచ్చారు. స్థానిక ఫైవ్స్టార్ హోటల్లో పనిమనిషిగా చేరారు. అయితే ఆమె ఆదివారాల్లో తప్ప మిగతా రోజుల్లో క్రమం తప్పకుండా పనికి వెళుతుండేవారు. ఎందుకంటే ఆమె ఆదివారాల్లో చర్చిలో పనిచేస్తుంటారు. మతం పట్ల ఆమెకున్న అభిప్రాయాలను హోటల్ సిబ్బంది కూడా గౌరవించి ఆదివారం సెలవు ఇచ్చారు.కానీ హోటల్లోని కిచెన్ మేనేజర్ కారణంగా మేరీకి సమస్యలు మొదలయ్యాయి. ఆదివారాలు పనికి రావాలని మేరీని మేనేజర్ ఆదేశించారు. ఇందుకు మేరీ ఒప్పుకోలేదు. చర్చిలోని ఫాదర్కు సమస్యను వివరించి ఓ లేఖను రాయించారు. ఆదివారాలు కూడా పనిచేయడం తమ మతాన్ని అగౌరవపరిచినట్లు అవుతుందని రాశారు. ఈ లేఖను మేరీ హోటల్ మేనేజర్కు ఇచ్చారు. అయినప్పటికీ మేనేజర్ కనికరించలేదు. దాంతో పదేళ్ల పాటు మేరీ ఆదివారాలు పనిచేయాల్సి వచ్చింది. మధ్యలో కొన్ని కారణాల వల్ల తోటి సిబ్బంది సాయంతో ఆదివారం సెలవు తీసుకునేవారు.ఈ విషయం మేనేజర్కు తెలీడంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. దాంతో మేరీ ఈఈఓసీ (సమాన ఉద్యోగ అవకాశ కమిషన్)ను ఆశ్రయించారు. మతం పట్ల తనకున్న నమ్మకాలను హోటల్ సిబ్బంది అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ హోటల్లో పనిచేస్తున్న ఇతర సిబ్బందికి అన్ని విషయాల్లో మద్దతు తెలుపుతున్న యాజమాన్యం మేరీ విషయంలో మాత్రం వ్యతిరేకత చూపారని న్యాయవాది మార్క్ న్యాయస్థానంలో వెల్లడించారు. అలా కొన్నేళ్ల పాటు నడిచిన ఈ కేసుపై ఫ్లోరిడాలోని ఫెడరల్ న్యాయస్థానం ఇటీవల తీర్పు ప్రకటించింది.మేరీ మనోభావాలను దెబ్బతీసినందుకు ఎగ్గొట్టిన జీతం మొత్తంతో కలిపి హోటల్ యాజమాన్యం 21.5 మిలియన్ డాలర్లకు పైగా చెల్లించాలని ఆదేశించింది. ఈ ఘటనపై హోటల్ యాజమాన్యం స్పందిస్తూ..‘న్యాయస్థానం తీర్పు మమ్మల్ని ఎంతగానో బాధించింది. కేసులోని నిజానిజాలు తేలకుండా తీర్పు వెలువరించినట్లు అనిపిస్తోంది. మేరీ మా హోటల్లో పనిచేసినంత కాలం ఆమెకు అనుకూలంగా ఉండే షిఫ్ట్లు వేశాం’ అని వెల్లడించింది.