గుంటూరు ): ‘జగన్ – కేటీఆర్ కలయిక ఓ చీకటి రోజు… ఆంరఽధుల ఆత్మగౌరవాన్ని జగన్ టీఆర్ఎస్ కాళ్లవద్ద తాకట్టు పెట్టాడు…’ అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కేసీఆర్తో కలవటానికి సిగ్గులేదా అంటూ జగన్ను నిలదీశారు. జగన్ను రాష్ట్ర ప్రజలు శాశ్వతంగా హైదరాబాదుకే పరిమితం చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ అపవిత్ర కలయికతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ నేతలకు ప్రజల నుంచి రాళ్లదెబ్బలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే ప్రధాని మోదీకి భయం పట్టుకోని ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కొత్త నాటకానికి తేర లేపారని మండిపడ్డారు. ఏపీలో కులాల మధ్య చిచ్చు పెట్టి కేసీఆర్ మెప్పు పొంది మంత్రి పదవి పొందాలని తలసాని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో దాదాపు పది బీసీ కులాలను ఓసీల్లో చేర్చితే ఎందుకు ప్రశ్నించలేదని తలసానిని నిలదీశారు. తెలంగాణ కంటే ఆంధ్రలో బలమైన బీసీ నేతలు ఉన్నారని 8 శాఖలకు మంత్రులుగా బీసీలున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో మీరు బీసీలకు ఇచ్చిన గౌరవమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. నమ్మించి మోసం చేసినందుకే తాము ఎన్డీఏ నుంచి బయటకొచ్చామని… హోదా ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన తరువాతే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నామని వివరించారు. జగన్ ఏ ప్రయోజనాలు ఆశించి టీఆర్ఎస్తో చేతులు కలిపారో తెలపాలని బోనబోయిన డిమాండ్ చేశారు.