సంచలనం సృష్టించిన నర్సింగ్ విద్యార్థిని అయేషా మీరా(19) హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. శుక్రవారం ఉదయం నుండి సత్యంబాబును సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. సత్యం బాబు కుటుంబ సభ్యుల స్టేట్ మెంట్ను సీబీఐ అధికారులు రికార్డ్ చేసుకుంటున్నారు. విజయవాడలోని నందిగామ సమీపంలోని అనగమసాగరం గ్రామంలో సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. బ్రహీంపట్నం శ్రీ దుర్గా హాస్టల్ నిర్వాహకులను సైతం సీబీఐ అధికారులు విచారించనున్నారు.ఈ కేసులో ఇప్పటికే విజయవాడ కోర్టుకు చెందిన ముగ్గురు కోర్టు సిబ్బందిపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసు డాక్యుమెంట్లు, సాక్ష్యాలు ధ్వంసం అయిన అంశంపై పి.కుమారి, పి. వెంకటకుమార్, వై సుబ్బారెడ్డిలపై కేసు నమోదు చేశారు. అయేషా మీరా కేసులో అసలు నిందితులను పట్టుకోవటంలో ఏపీ పోలీసులు విఫలమవ్వటంతో హైకోర్టు ఈ కేసును సీబీఐకి బదిలీ చేసిన సంగతి తెలిసిందే.