దిల్లీ: స్వైన్ ఫ్లూతో ఆసుపత్రిలో చేరిన భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రస్తుతం కోలుకుంటున్నారని ఆ పార్టీ గురువారం వెల్లడించింది. ఒకట్రెండు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అవుతారని భాజపా తెలిపింది.‘భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా కోలుకుంటున్నారు. రేపు లేదా ఎల్లుండి ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారు. మీ అభిమానానికి ధన్యవాదాలు’ అని భాజపా మీడియా హెడ్, రాజ్యసభ సభ్యులు అనిల్ బలూనీ తెలిపారు. స్వైన్ ఫ్లూతో బాధపడుతూ అమిత్ షా నిన్న ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా తెలిపారు. దేవుడి దయ, అందరి అభిమానంతో తాను త్వరగా కోలుకుంటానని పేర్కొన్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులెరియా పర్యవేక్షణలో వైద్యులు అమిత్ షాకు చికిత్స అందిస్తున్నారు.
ఆసుపత్రిలో చేరిన మరో భాజపా నేత
కాగా.. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ లాల్ అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న రామ్ లాల్ను కుటుంబసభ్యులు నోయిడాలోని కైలాశ్ ఆసుపత్రిలో చేర్పించారు.