గుర్తు తెలియని వ్యక్తులు అత్తాకోడళ్లను అత్యంత కిరాతంగా హత్య చేసి మృతదేహాలను చెల్లాచెదురుగా పడేసిన ఘటన గురువారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని బొందిలీపురంలో చోటు చేసుకుంది.బొందిలీపురానికి చెందిన అబ్దుల్ ఖుదీష్ జిలాని చెప్పుల దుకాణం నిర్వహిస్తూ కుటుంబంతో కలసి విజయ్నగర్ కాలనీలో నివాసముంటున్నారు.ప్రతీరోజూ తరహాలోనే గురువారం కూడా అబ్దుల్ దుకాణానికి వెళ్లగా ఇద్దరు పిల్లలు పాఠశాలకు వెళ్లారు.ఈ క్రమంలో అబ్దుల్ ఇంట్లో చొరబడ్డ గుర్తు తెలియని దుండగులు ఇంట్లో ఉన్న అత్తాకోడళ్లు మెహర్ ఉన్నీషా(37),జురాబాయ్(65)లను అత్యంత కిరాతంగా హత్య చేసి పారిపోయారు.సాయంత్రం పాఠశాల నుంచి తిరిగి వచ్చిన పిల్లలు ఎంతపిలిచినా తలుపులు తీయకపోవడంతో తండ్రి అబ్దుల్కు ఫోన్ చేసి విషయాన్ని తెలిపారు.పక్కనే నివాసం ఉంటున్న చిన్నాన్న ఇంట్లో మరోజత తాళాలు ఉంటాయని వెళ్లి తలుపులు తెరవమని తండ్రి సూచన మేరకు నకిలీ తాళాలతో తలుపులు తీయగా ఇంట్లో చెల్లాచెదురుగా పడి ఉన్న తల్లి,నానమ్మ మృతదేహాలను చూసి భయభ్రాంతులకు లోనై పిల్లలు గట్టిగా కేకలు వేసారు.పిల్లల కేకలు విన్న స్థానికులు వెంటనే వెళ్లి పరిశీలించగా అత్తాకోడళ్లు రక్తపుమడుగులో పడి ఉండడాన్ని గుర్తించి అబ్దుల్కు విషయం తెలిపారు.హుటాహుటిన ఇంటికి చేరుకున్న తల్లి,భార్య మృతదేహాలు చూసి భోరున విలపించాడు.స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.ఇంట్లో నగదు సుమారు రూ.4 లక్షలు, విలువైన బంగారం దోచుకెళ్లారని బాధితుడు జిలానీ పోలీసుల ముందు బోరునమన్నాడు.
ఘటనపై అనుమానాలు…
సంఘటన జరిగిన తీరు చూస్తే ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. జిలానీ తన షాపుల నిమిత్తం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కలెక్షన్లకు గురువారం ఉదయం వెళ్లాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో తమకు తెలిసిన బంధువు ఇంటికి వచ్చి వెళ్లినట్లు పోలీసులు వద్ద ప్రాథమిక సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సంఘటనా స్థలానికి రాత్రి పోలీసులు వచ్చి చూసేసరికి రెండు మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అందులో మోహర్ ఉన్నీషా మృతదేహం హాలులో పడి ఉండగా ఆమె తలపై బలమైన గాయంతో పాటు రెండు చేతుల మణికట్లుమీద కోసి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక జూరాబాయ్ మృతదేహం వంటగదిలో పడి ఉంది. ఆమె తలకు, చేతులుపై బలమైన గాయాలున్నాయి.