దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన కడప అమీన్పీర్ (పెద్దదర్గా) ఉరుసు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉరుసు సందర్భంగా దర్గాను రంగు రంగుల విద్యుత్తు దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆదివారం మలంగ్షా, సర్గిరోలు, ఫఖీర్లు బాదుల్లా సాహెబ్ మకాన్ వద్దకు చేరుకుని చదివింపులు చేసి అక్కడ నుంచి బ్యాండ్ మేళాలతో ఉరేగింపుగా దర్గాకు చేరుకున్నారు. రాత్రి 8.30 గంటలకు మలంగ్షాను పీఠాధిపతి దర్గాలోని మహనీయుల సమాధుల వద్ద చదివింపులు ఇచ్చి మలంగ్షాను పీరి స్థానానికి తీసుకెళ్లి కూర్చోబెట్టి పీఠాధిపతి సీల్ వేశారు. తిరిగి మంగళవారం లేవనెత్తుతారు. అప్పటి వరకు వెంట్రుకవాసి కూడా కదలకుంèకాయన అలానే ఉంటారు. పీఠాధిపతి వేసిన సీల్ చెదిరిపోకుండా అలానే ఉంటుంది. రాత్రి 10 గంటలకు పీఠాధిపతి నివాసం నుంచి గంధం తీసుకొచ్చి వివిధ దర్గాల గురువులు, దేశ నలుమూలల నుంచి వచ్చిన పండితులు, భక్తశిష్యకోటి బృందాలతో ఉరేగింపుగా దర్గాకు చేరుకుని పీఠాధిపతి గంధం సమర్పించి ఫాతెహా (చదివింపులు) చేశారు. గంధం మహోత్సవాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు హాజరైన గంధోత్సవాన్ని కన్నులపండువగా తిలకించి తరించారు. దర్గా మొత్తం అల్లా నామ స్మరణతో హోరెత్తిపోయింది. కొన్ని వేల మంది గంధోత్సవాన్ని తిలకించారు. రాత్రి 10 గంటలకు జరిగిన గంధం మహోత్సవంలో ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ఆయన కుమారుడు అమీర్ పాల్గొన్నారు.