హైదరాబాద్ : ఆశావహుల
నినాదాలు, అరుపులతో హైదరాబాద్లోని జగన్ నివాసం లోటస్పాండ్ మంగళవారం
హోరెత్తింది. వైఎస్సార్సీపీ టికెట్లను ఆశిస్తున్న వారు పెద్ద సంఖ్యలో క్యూ
కట్టారు. అనంతపురం జిల్లా ఉరవకొండ టికెట్టును శివరామిరెడ్డికి ఇవ్వాలని ఆయన
అనుచరులు ఆందోళనకు దిగారు. బ్యానర్లతో నినాదాలు చేపట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే
విశ్వేశ్వరరెడ్డికి టికెట్టు ఇస్తే, సహాయ నిరాకరణ చేస్తామని, ఓడించి తీరుతామని
ప్రతినబూనారు. జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డి కారును కూడా అడ్డగించారు. చిత్తూరు
జిల్లా పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కు చేదు అనుభవం ఎదురైంది.
తన కుటుంబ సభ్యులతో లోటస్పాండ్కు వచ్చిన ఆయన జగన్తో భేటీ కోసం రెండు గంటల పాటు ప్రయత్నించారు.
అప్పుడే అటుగా వచ్చిన పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి
రామచంద్రారెడ్డితో మాట్లడడానికి ప్రయత్నించగా, ఆయన చూసీ చూడనట్లు వెళ్లిపోయారు.
దీంతో సునీల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. గుంటూరు జిల్లా బాపట్ల
నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు నిరసనకు దిగారు. ఎమ్మెల్యే రఘుపతికి
వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నాయకుడు
గోవర్ధనరెడ్డికి టికెట్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెబెల్స్ సంఖ్య రోజు రోజుకు
పెరుగుతుండడంతో ఎంపీ విజయసాయిరెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డిలు వారిని బుజ్జగించే
ప్రయత్నాల్లో పడ్డారు.