లఖ్ నవ్:ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘అజయ్: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి’ చిత్రం విడుదలకు సెన్సార్ బోర్డు అడ్డుపడింది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ నిరాకరించడం గమనార్హం. దీంతో మేకర్స్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. యోగి ఆదిత్యనాథ్ పాత్రలో అనంత్ జోషి నటించిన ఈ చిత్రానికి రవీంద్ర గౌతమ్ దర్శకత్వం వహించారు. యోగి గురువు మహంత్ పాత్రలో పరేశ్ రావల్ నటించారు. అయితే, ఈ సినిమా ఇటీవల సెన్సార్కు వెళ్లగా బోర్డు దీనికి సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ చిత్రానికి సెన్సార్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. దీంతో దర్శక నిర్మాతలు కోర్టుమెట్లు ఎక్కారు. ఈ రోజు దీనిపై విచారణ జరగనుంది. ఈ పిటిషన్ ను స్వీకరించే సమయంలో హైకోర్టు సెన్సార్ బోర్డును కొన్ని ప్రశ్నలు అడిగింది. గత ఎనిమిదేళ్లుగా ప్రజాక్షేత్రంలో ఉన్న ఒక నవల ఆధారంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించామని న్యాయస్థానానికి మేకర్స్ వెల్లడించారు. దీంతో పుస్తకంపై ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు దాని ఆధారంగా తెరకెక్కిన సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వడానికి ఎందుకు నిరాకరించారో తెలపాలని కోర్టు సెన్సార్ బోర్డును ఆదేశించింది. పుస్తకంపై ఎటువంటి సమస్యలు లేనప్పుడు సినిమాకు అభ్యంతరాలు ఎందుకని కోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేస్తూ వివరణ కోరింది.