అమరావతి : రుషికొండ ప్యాలెస్ చుట్టూ వస్తున్న వార్తలపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ప్యాలెస్ను ఎలా ఉపయోగించుకోవాలన్నది ఆలోచించడం మానేసి, దానిని ఇంకా జగన్మోహన్రెడ్డి ఇల్లుగానే చిత్రీకరించడాన్ని మానుకోవాలని టీడీపీ నేతలకు సూచించారు. విశాఖను తాము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని అనుకున్నామని కానీ, అనేక అడ్డంకులు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖ నుంచే పాలించాలని అనుకున్నామని, ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసిన తర్వాత రుషికొండలో భవనాలు నిర్మించినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ ధనం దుర్వినియోగం గురించి మాట్లాడాల్సి వస్తే 2014 నుంచి 2019 వరకు జరిగిన దానిపైనా మాట్లాడాల్సి వస్తుందని పేర్కొన్నారు. తాము ఇప్పుడే విమర్శలు చేస్తే అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేక చేస్తున్నామని అనుకుంటారనే అలాంటి విషయాల జోలికి పోవడం లేదని తెలిపారు. నగరానికి రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, లేదంటే ఇతర ముఖ్యలు వస్తే ప్రైవేటు హోటళ్లలోనో, మరెక్కడో ఉంచాల్సిన పరిస్థితి వస్తోందని, ఇప్పుడు రుషికొండ భవనాలను వారి ఆతిథ్యానికి వాడుకోవచ్చని వివరించారు. దీనిపై ఇంకా రాద్ధాంతం తగదని హితవు పలికారు. ప్రజలిచ్చిన అధికారాన్ని తమకంటే మంచి చేయడానికి ఉపయోగించాలని, ప్రజలను ఇలా తప్పుదోవ పట్టించే చర్యలకు ఉపయోగించవద్దని హితవు పలికారు.