ఢిల్లీ : కరోనా కష్టకాలంలో ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్ఓ) నుంచి చందాదారులు భారీ ఎత్తున నిధులను విత్డ్రా చేసుకున్నారు. ఏప్రిల్ ప్రారంభం నుంచి 80 లక్షల మంది చందాదారులు ఏకంగా రూ.30వేల కోట్ల నగదును విత్డ్రా చేసుకున్నారు. కరోనా ప్రేరేపిత లాక్డౌన్ వల్ల పలువురు ఉద్యోగాలను కోల్పోవడం, కంపెనీలు జీతాల చెల్లింపులు ఆలస్యం కావడం, జీతాల్లో కోత విధించడం, అత్యవసర వైద్య ఖర్చులు తదితర అంశాలు నగదు ఉపసంహరణకు దారితీసినట్లు ఈపీఎఫ్ఓ అధికారులు తెలిపారు. ఈపీఎఫ్ఓ పరిధిలో మొత్తం 6 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. సంస్థ రూ.10 లక్షల కోట్ల నిధిని నిర్వహిస్తోంది. ఈ మొత్తం నగదు ఉపసంహరణలో… లాక్డౌన్ విధింపు ప్రారంభ నెలల్లో దాదాపు 30 లక్షల మంది చందాదారులు రూ.8వేల కోట్లను విత్ డ్రా చేసుకున్నారు. మిగతా రూ.22వేల కోట్లు సాదారణ విత్డ్రా రూపంలో జరిగాయి. ప్రస్తుత ట్రెండ్ ఇలా కొనసాగితే రానున్న రోజుల్లో ఈపీఎఫ్ నుంచి విత్డ్రా చేసుకోనే వారు సంఖ్య కోటికి చేరుకోవచ్చని అధికారు అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో నగదు ఉపసంహరణతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫండ్ ఆదాయాలపై భారీ ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.