ముంబై : వచ్చే మే
నెలలో ఇంగ్లండ్లో జరుగనున్న ప్రపంచ క్రికెట్ కప్పునకు భారత జట్టు ఎంపిక దాదాపుగా
పూర్తయిందని ప్రధాన సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు. ముంబైలో మంగళవారం
ఆయన విలేకరులతో మాట్లాడుతూ 15 మంది సభ్యులతో ఉండే జట్టు కోసం 14 మంది ఎంపిక
పూర్తయిందన్నారు. మిగిలిన ఒక స్థానం కోసం గట్టి పోటీ ఉందని చెప్పారు. ఇటీవల అనేక
మంది కుర్రాళ్లు చక్కటి ప్రతిభను కనబరుస్తుండడంతో ఎంపిక తమకు కఠినంగా
మారిందన్నారు. ఈ నెలాఖరు నుంచి ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగనున్న సిరీస్ అనంతరం ఆ ఒక
స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలో తేలుతుందన్నారు.