దిల్లీ: వచ్చే ఎన్నికల్లో యాభై 50 శాతం మేరకు ఓటు రసీదు యంత్రా (వీవీప్యాట్)లను లెక్కించేలా ఆదేశాలు జారీ చేయాలని ప్రతి పక్షాలు దాఖలు చేసిన వ్యాజ్యం పై వివరణ ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ కేంద్ర ఎన్నికల సంఘానికి తాఖీదుల్ని జారీ చేసింది. ఈ విషయంలో తమకు వివరాలు అందించేందుకు సీనియర్ అధికారి ఒకరిని నియమించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించి, తదుపరి విచారణను ఈ నెల 25 కు వాయిదా వేసింది. ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంపై అనుమానాలు తలెత్తు తున్నందున వచ్చే లోక్సభ ఎన్నికల్లో తప్పని సరిగా 50 శాతం మేరకు వీవీప్యాట్లను లెక్కించి, వాటిని ఆయా ఈవీఎంలలో నమోదైన ఓట్లతో సరి పోల్చేలా నిబంధనలు చేయాలని ఇరవై మూడు రాజకీయ పక్షాలు గత నెల్లో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్పవార్,రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఎస్పీ, బీఎస్పీ ఎంపీలు రాంగోపాల్యాదవ్, సతీష్ చంద్ర మిశ్రల తదితరులు గత ఫిబ్రవరి 4న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోడా, కమిషనర్ అశోక్ లవాసాలకు వినతి పత్రాన్ని సమర్పించారు. దీనికి సంతృప్తికర స్పందన లేక పోవడంతో సుప్రీం కోర్టులో వ్యాజ్యాల్ని ధాఖలు చేసారు .