సొంత గూడు చేరిన విజయశాంతి

న్యూ ఢిల్లీ: నటి విజయశాంతి ఎట్టకేలకు సొంత గూడు – భాజపా చేరారు.పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో కాషాయ తీర్థాన్ని సోమవారం ఇక్కడ పుచ్చుకున్నారు. అనంతరం విలేఖరులతో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.‘1998 జనవరిలో బాజపా రాజకీయ జీవితాన్ని ప్రారంభించా. తెలంగాణ సాధనకు ఎంతో కృషి చేశా. కొన్ని కారణాల వల్ల తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేపా. నా పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయమని కేసీఆర్ ఒత్తిడి తీసుకొచ్చారు. కేసీఆర్ కంటే ముందు నుంచే తాను తెలంగాణ కోసం పోరాడుతున్నా. తొలుత టీఆర్ఎస్ నుంచి తాను, కేసీఆర్ ఇద్దరం ఎంపీలుగా గెలిచాం. 2013 జూలైలో నన్ను పార్టీ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేసారు. తొలి నుంచి కేసీఆర్ నాపై కుట్ర పూరితంగానే వ్యవహరించారు. టీఆర్ఎస్ నుంచి నేనే బయటకు వెళ్లానని దుష్ప్రచారం చేశారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీ లో టీఆర్ఎస్ ను విలీనం చేస్తానని సోనియా గాంధీకి చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత ఆమెను మోసం చేశారు. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడే నాయకులు ఎవరూ ఉండకూడదనే ఆలోచనతో ఇతర పార్టీల నేతలందరినీ టీఆర్ఎస్ లోకి కేసీఆర్ చేర్చుకున్నారు. తెలంగాణలో పెద్ద స్థాయిలో అవినీతి జరుగుతోంది. కేసీఆర్ అవినీతి భాగోతాన్ని బయటపెడతా. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే రాబోతోంది. నేను ఏ పార్టీలో ఉన్నా కీలక పాత్రను పోషిస్తాన’ని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos