న్యూ ఢిల్లీ : జాతీయ బ్యాంకులు 80 శాతం రుణాలను బడా పారిశ్రామిక వేత్తలకే అందిస్తాయని, యువత, రైతులను పట్టించుకోవని ఆరోపించారు భాజపా లోక్సభ సభ్యుడు వరుణ్ గాంధీ సొంత ప్రభుత్వంపైనే మరోమారు విమర్శలు గుప్పించారు. బరేలీ జిల్లాలోని బహేరి తహసీల్లో శనివారం పర్యటించినపుడు విలేఖరులతో మాటాట్లాడారు. ‘జాతీ య బ్యాంకులు రుణాలు మంజూరు చేసే విధానాలు ప్రశ్నార్థకం. కార్పొరేట్లకే బ్యాంకులు 80 శాతం రుణాలు ఇస్తాయి. యువత, రైతులకు మొండి చేయి చూపిస్తాయి. రూ.1000 కోట్లకు పైగా వార్షిక వ్యాపారాలు చేస్తున్న పారిశ్రామికవేత్తలకే బ్యాంకులు 80 శాతం రుణాలు ఇస్తాయి. మిగిలిన 20 శాతంలో 11 శాతం రూ.50 కోట్లపైన టర్నో వర్ ఉన్న చిన్న పరిశ్రమలకు అందిస్తాయి. దేశంలోని యువత, రైతులు, కూలీలకు ఎంత శాతం రుణాలు కేటాయిస్తున్నారనే విషయంపై ఆయా జాబితాలను పరిశీలించగా కీలక విషయాలు తెలిశాయి. కేవలం 9శాతం మాత్రమే వారికి రుణాలు ఇస్తున్నట్లు తెలిసింది. ఇప్పుడు యువతకు ఇతర ఉపాధి మార్గాలు ఏమిటి అనేదే పెద్ద ప్రశ్న. ప్రస్తుతం రైతుల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా రైతులంతా రుణాల ఊబిలో కూరుకుపోతున్నారు. సరైన సమయానికి రుణాలు అందక, బకాయిలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. పలు కొనుగోలు కేంద్రాలను సందర్శించినపుడు వెళ్లినప్పుడు ఆశ్చర్యపోయా. కొన్ని చోట్ల అసలు కేంద్రాలే లేవు. రైతులు ఏడాదంతా సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు. యువత భవిష్యత్తుపై ఆందోళనగా ఉంది. 15 ఏళ్ల క్రితం నేను రాజకీయాల్లో చేరినప్పుడు నా భవిష్యత్తు గురించి ఆలోచించేవాడిని. ఇప్పుడు నా ఆందోళన అంతా యువత, వారి భవిష్యత్తుపైనే.’ అని పేర్కొన్నారు.