వల్లభనేని వంశీ అరెస్టు

వల్లభనేని వంశీ అరెస్టు

గన్నవరం: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం పోలీసుల సహకారంతో హైదరాబాద్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. వంశీని హైదరాబాద్‌ నుంచి విజయవాడకు పోలీసులు తరలిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో గన్నవరంలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగింది. వైసీపీకి చెందిన పలువురు నాయకులు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసి.. అక్కడి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీనిపై కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేశారు. ఇందులో వల్లభనేని వంశీని కూడా అప్పట్లోనే నిందితుడిగా చేర్చారు. అయితే ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ఉండేదుకు ముందస్తు బెయిల్‌ను కూడా వంశీ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ముందస్తు బెయిల్‌ ఉండగా తనను ఎలా అరెస్టు చేస్తారని ఏపీ పోలీసులను వల్లభనేని వంశీ ప్రశ్నించారు. అయితే టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన కేసులో అరెస్టు చేయడం లేదని పోలీసులు తెలిపారు. మరో కేసులో అరెస్టు చేస్తున్నామని వివరించారు. కాగా, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడిపై కంప్యూటర్‌ ఆపరేటర్‌ సత్యవర్ధన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే తాజాగా సత్యవర్దన్‌ కేసు వెనక్కి తీసుకున్నాడు. సత్యవర్దన్‌ను వంశీ అనుచరులు బెదిరించడంతోనే కేసు వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వంశీపై విజయవాడ పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 140(1), 308, 351(3), రెడ్‌ విత్‌ 3(5) కింద కేసులు నమోదు చేశారు. ఎస్సీ – ఎస్టీ అట్రాసిటీ కింద కూడా కేసులు నమోదు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos