న్యూ ఢిల్లీ: కరోనా బారిన పడకుండా ఉండాలంటే రెండు మోతాదుల టీకాలు వేసుకోవాలి. కరోనా బారిన పడి కోలుకున్న వారు ఒక్క మోతాదు టీకా వేసుకుంటే చాలు. వారిలో కరోనా యాంటీబాడీలు ఉండటంఇందుకు కారణం. అమెరికాలోని సెడార్స్-సినాయ్ మెడికల్ సెంటర్ ఓ అధ్యయనంలో ఇది తేలింది. సర్వేలో దాదాపు 1,000 మంది పాల్గొన్నారు. వీరిలో కరోనా నుంచి కోలుకున్న వారు, వైరస్ బారిన పడని వారు ఉన్నారు. కరోనా నుంచి కోలుకున్న వారికి ఒక్క మోతాదు టీకా ఇవ్వగానే వారిలో రోగనిరోధక శక్తి చాలా మెరుగైనట్లు పరిశోధకులు గుర్తించారు. కరోనా సోకని వారిలో రెండు మోతాదులు ఇచ్చినప్పటికీ వారిలో అంతగా మార్పులు రాలేదని చెప్పారు. ప్రస్తుతం చాలా దేశాల్లో వ్యాక్సిన్ కొరత ఉంది. కరోనా నుంచి కోలుకున్న వారికి ఒక డోసు మాత్రమే ఇవ్వడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల డోసుల వ్యాక్సిన్లు ఆదా అవుతాయని యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ స్కూల్ ఆప్ మెడిసిన్ పరిశోధకులు లెక్కగట్టారు. సాధారణంగా వైరస్ నుంచి కోలుకున్న వారిలో యాంటీబాడీలు ఉత్పత్తి అయి కొన్నాళ్లకు తగ్గిపోతాయి. మళ్లీ వైరస్ శరీరంలోకి చేరితే మళ్లీ అవి క్రియాశీలకంగా మారతాయి. రోగ నిరోధక వ్యవస్థ వైరస్ను గుర్తు పెట్టుకుని అది శరీరంలో చేరగానే పోరాడుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, జర్మనీలాంటి పలు దేశాలు కరోనా నుంచి కోలుకున్న వారికి రెండు డోసుల వ్యాక్సిన్లో కేవలం ఒక డోసే ఇస్తున్నాయి.