తిరుపతి : వారాహి డిక్లరేషన్ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. హైందవ సంస్కృతిని పవన్ కల్యాణ్ కించపరుస్తున్నారని విమర్శించారు. అసలు సనాతన ధర్మం గురించి ఆయనకు ఓనమాలు అయినా తెలుసా అని ప్రశ్నించారు. ‘ఆయన ఒక క్షుద్ర రాజకీయ నాయకుడు. మతం ముసుగులో నాటకం ఆడాలని చూస్తున్నార’ని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారాహి డిక్లరేషన్ సభలో పవన్ కల్యాణ్ను చూస్తుంటే కెవ్వుకేక పాట గుర్తొచ్చిందని, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు పీఠాధిపతి పవన నానంద స్వాముల వారు తిరుపతికి వేంచేసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. రాజకీయాలు మాట్లాడనంటూనే తన మీద, వైఎస్ జగన్ మీద ఇష్టానుసారంగా రాజకీయ ప్రేలాపనలు చేశారని మండిపడ్డారు. కోర్టులను కూడా హెచ్చరిస్తున్నట్లుగా మాట్లాడిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం తన వల్లే కాపాడబడుతున్నట్లుగా కలరింగ్ ఇచ్చారని, హైందవ సంస్కృతిని కించపరుస్తున్నారని మండిపడ్డారు. సనాతన ధర్మం గురించి ఓనమాలు కూడా తెలియని వ్యక్తి అని విమర్శించారు. పీఠాధిపతులంతా తమ జీవితాలను త్యాగం చేశారు. ఈ పీఠాలకు ఏ విలువ లేదన్నట్లుగా మాట్లాడారని అన్నారు. ఆయన మాటలు విని వారంతా భయపడిపోతారని చెప్పారు. పవన్ భాష మతి చలింపేజేసేలా ఉందని.. ఇప్పటివరకు ఎవరూ సనాతన ధర్మాన్ని పరిరక్షించలేదని మాట్లాడారని మండిపడ్డారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. దాన్ని పవన్ కల్యాణ్ ఏర్పాటు చేయడమే తమకు అభ్యంతరమన్నారు. 14 ఏండ్లుగా తన కుమార్తెలను దైవ దర్శనానికి తీసుకురాని వ్యక్తి ఇప్పుడు సనాతన ధర్మ ఆచార్యులు అయ్యారని భూమన విమర్శించారు. సనాతన ధర్మంలో పిల్లలకు 9 నెలలకే తలనీలాలు తీయడం ఆనవాయితీ.. కానీ ఎప్పుడూ అలా చేయని పవనానంద స్వామి ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షుడు అయ్యాడని విమర్శించారు. పవన్ కల్యాణ్ మనసంతా విషంతో నిండి ఉన్నద అన్నారు. పవన్ క్షుద్ర రాజకీయ నాయకుడు అని మండిపడ్డారు. మతం ముసుగులో నాటకం ఆడాలని అనుకుంటున్నాడని విమర్శించారు. హైందవ సంస్కృతికి పవన్ కల్యాణ్ చేస్తున్న అన్యాయం అంతా ఇంతా కాదని మండిపడ్డారు. శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగితే తాను ఏ శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు. శ్రీవాణి ట్రస్టుపై చేసిన ఆరోపణలు నిజమేనని దేవుడిపై ప్రమాణం చేసి చెప్పాలని పవన్ కల్యాణ్కు సవాలు విసిరారు. రాజకీయంగా ఎదగడం కోసమే పవన్ కల్యాణ్ కాషాయం ధరించాడని.. సుప్రీంకోర్టును సైతం ప్రభావితం చేయడానికే మాట్లాడారని విమర్శించారు. మాజీ ఈవో ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నారో పవనానంద స్వాముల వారు తమ దివ్యశక్తితో కనుక్కోవాలని కోరుతున్నానని ఎద్దేవా చేశారు.