ప్రయాగ్ రాజ్ : మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తడం వల్ల భారీ ఎత్తున వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిద్దామని వచ్చిన లక్షలాది భక్తులు రహదారులపై చిక్కుకున్నారు. ఫలితంగా యూపీ పోలీసు యంత్రాంగం ప్రయాగ్రాజ్కు వెళ్లే మార్గాల్లో రాకపోకలను నిలిపివేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. 300 కిలోమీటర్ల మేర వాహన రాకపోకలకు అంతరాయం కలిగినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సుమారు 48 గంటలుగా ట్రాఫిక్లో చిక్కుకున్నామని, 50 కిలోమీటర్లు వెళ్లేందుకు దాదాపు 12 గంటల సమయం పడతుందని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాగ్రాజ్కు దారితీసే మార్గాల్లో భారీ ట్రాఫిక్జామ్ నేపథ్యంలో ఉత్తర్ప్రదేశ్ సర్కార్పై సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మాహాకుంభమేళా ఏర్పాట్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. ట్రాఫిక్జాం కారణంగా రహదారులపై చిక్కుకున్న లక్షలాది మంది భక్తులు ఆకలి, దాహంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. గంటగంటకు ట్రాఫిక్ రద్దీ పెరగుతుండడం వల్ల భక్తులు ఆహారం, విశ్రాంతి లేక నీరసించిపోతున్నారని పేర్కొన్నారు. సామాన్య భక్తులూ మనుషులే అనీ మానవతా దృక్పథంలో వాళ్లకీ అత్యవసర ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ప్రయాగ్రాజ్ ప్రవేశం సమీపంలో నవాబగంజ్లో 30 కిలోమీటర్లు, గౌహానియాలో 16 కిలోమీటర్లు, వారణాసి మార్గంలో 12 నుంచి 15 కలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్లు అఖిలేశ్ యాదవ్ తెలిపారు. విపరీతమైన రద్దీ కారణంగా రైలు ఇంజిన్లోకి కూడా ప్రయాణికులు ప్రవేశిస్తున్నారని, కిలోమీటర్ల మేర ట్రాఫిక్జాం కారణంగా జనజీవనం స్తంభించిందని మండిపడ్డారు. ప్రయాగ్రాజ్కు వెళ్లే జబల్పుర్-రేవా రహదారిపై దాదాపు 350 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారతదేశ చరిత్రలో ఇంతలా రోడ్లపై వాహనాలు నిలిచిపోవడం చాలా అరుదు. ఇప్పటికి ప్రపంచంలో అతిపెద్ద ట్రాఫిక్ జామ్ చైనా పేరిట ఉంది. చైనా రాజధాని బీజింగ్లో 2010లో 100 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 12 రోజుల పాటు ప్రజలు అప్పుడు ట్రాఫిక్లో ఇరుక్కున్నారు. ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి కూడా ఎక్కింది. 2012లో బ్రెజిల్లోని సావోల పాలోలో 300 కిలోమీటర్లు జామ్ అయిన ట్రాఫిక్లో వాహనదారులు 12-15 గంటలు చిక్కుకుపోయారు.