కరోనాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలను వ్యక్తి కుటుంబ సభ్యులకు తెలియకుండానే పూర్తి చేసిన ఘటనపై వివాదం రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది.తన భర్త మధుసూదన్ కనిపించడం లేదంటూ కొద్ది రోజుల క్రితం వనస్థలీపురానికి చెందిన మాధవి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే కరోనా బారిన పడి మృతి చెందిన మధుసూదన్కు అతడి కుటుంబ సభ్యులకు తెలియకుండా అంత్యక్రియలు నిర్వహించారు.ఈ విషయం తెలుసుకున్న మధుసూదన్ భార్య మాధవి దీన్ని ప్రశ్నిస్తూ మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేశారు. నా భర్తను ఏప్రిల్ 27న కోఠి ఆసుపత్రిలో చేర్చారు. తరువాత ఏప్రిల్ 30న గాంధీ ఆసుపత్రికి మార్చారు. మే 1న నా భర్త మరణించినట్టు, మే2న అంత్యక్రియలు జరిపినట్టు చెబుతున్నారు’’.‘‘కానీ మా అనుమతి తీసుకోలేదు. మాకు ఆయన్ను చూపించలేదు. వీడియో లేదా ఫోటో సాక్ష్యం లేదా ఆయన వస్తువులు చూపించమని అడగ్గా స్పందించలేదు’’.‘‘నేను, నా కుటుంబ సభ్యులు మే 16న డిశ్చార్జి అయ్యాం. నా భర్త గురించి అడిగితే.. ఆయన వెంటిలేటర్ పై ఉన్నారని చెప్పారు. ఒకసారి ఆయన బతికున్నాడనీ, మరోసారి చనిపోయాడనీ చెబుతున్నారు. మీరు నా భర్త ఆచూకీ కేసులో సాయం చేగలరు’’ అంటూ ట్వీట్ చేశారు మాధవి. ఈ ట్వీట్ బాగా వైరల్ అయ్యింది.‘‘మా మామగారు కోవిడ్-19తో చనిపోయారు. అప్పుడు మా అత్తగారికి చూపించారు. నేను మే 1వ తేదీ మధ్యాహ్నం 12.30 వరకూ నా భర్తతో మాట్లాడాను. అదే రోజు రాత్రి 7.30కి మా చుట్టుపక్కల వాళ్లు నాకు ఫోన్ చేసి నా భర్త మరణించారని చెప్పారు. డాక్టర్లను అడిగితే వెంటిలేటర్ పై ఉన్నారు అని చెప్పారు. మీరు ముందు కోలుకోండి. మీతో పాటూ ఆయనా వస్తాడు అన్నారు. రకరకాలుగా చెప్పారు’’ అంటూ మాధవి తెలిపారు. ‘‘నా భర్త అంత్యక్రియలు చేశాము అంటున్నారు. కనీసం నా అనుమతి తీసుకోలేదు. అసలు ఆ వ్యక్తి నా భర్తో కాదో గుర్తించకుండా ఎలా చేశారు? ఫోటోలు, వీడియో, చివరికి సీసీటీవీ ఫుటేజ్ అయినా ఉందా’’ అని ప్రశ్నిస్తున్నారు మాధవి.‘‘అసలు నేను ఆసుపత్రికి ఎలా వెళ్లానో అలానే వచ్చాను. చాలా వైరస్ లక్షణాలు నాలో చాలా తక్కువ కనిపించాయి. నాకెప్పుడూ సీరియస్ కాలేదు. నా భర్త సంపూర్ణ ఆరోగ్య వంతుడు. ఆయనకు ఎలా సీరియస్ అవుతుంది. ఇవన్నీ సరే, నిజంగా నా భర్త చనిపోతే నాకు డెత్ సర్టిఫికేట్ ఇవ్వండి’’ అంటూ డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు. ఆ కుటుంబంలో అప్పటికే మాధవి మామగారు చనిపోయారని.. ఆ మరుసటి రోజే భర్త కూడా చనిపోయారని అన్నారు. అప్పటికే కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో వున్న ఆ కుటుంబానికి ఈ వార్త తెలిస్తే మరింత ఆందోళనకు గురవుతారని.. మృతి విషయం చెప్పలేదని తెలిపారు. తామే అంత్యక్రియలు నిర్వహించామని అన్నారు. అమెరికా, ఇటలీ లాంటి దేశాలలో వందలమంది చనిపోతే కుటుంబ సభ్యులు లేకపోతే ప్రభుత్వాలే అంత్యక్రియలు చేశాయి అన్నారు మంత్రి ఈటల. ఏప్రిల్ 29వ తేదీన వనస్థలిపురం నుండి ఈశ్వరయ్య అనే పేషంట్ కరోనా పాజిటివ్తో గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఇరవైనాలుగు గంటల లోపే 30వ తేదీన చనిపోయారు. దీనితో ఆయన కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు చేశాం.ఈశ్వరయ్య కొడుకు మధుసూదన్ తీవ్రమైన శ్వాస సంబంధమైన ఇబ్బందితో గాంధీకి వచ్చారు. 1వ తేదీన చనిపోయారు. అప్పటికే ఆయన భార్యతో సహా కుటుంబసభ్యులు అందరూ క్వారంటైన్లో ఉన్నారు.భార్యకి చెప్తే షాక్కి గురవుతుంది అనీ, గంభీరమైన సందర్భంలో చెప్పకుండా ఉండటమే మేలని చుట్టాలు చెప్పిన నేపధ్యంలో మృతదేహాన్ని పోలీసులకి అప్పగించి జిహెచ్ఎంసి ద్వారా దహన సంస్కారాలు నిర్వహించారని మంత్రి వివరించారు.బంధువులకు చెప్పకుండా కరోనా వచ్చిన మధుసూదన్ను ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించింది అని వస్తున్న ఆరోపణలను మంత్రి ఖండించారు. కోలుకుని బయటకి వచ్చాక గాంధీ ఆస్పత్రిపై ఆరోపణలు చేయడం సరికాదు అన్నారు. రాపిడ్ కిట్స్ మీద నమ్మకం లేదని మొదటి నుండి చెప్తున్నాము. ఇప్పుడు ICMR కూడా అదే చెప్పింది అని మంత్రి అన్నారు.