ఇంగ్లండ్‌కు ఇన్నింగ్స్ ఓటమి

  • In Sports
  • March 6, 2021
  • 168 Views
ఇంగ్లండ్‌కు ఇన్నింగ్స్ ఓటమి

అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో ఇక్కడ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచులో ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా వరుసగా హ్యాట్రిక్ గెలుపును అందుకుంది. ఫలితంగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్యూటీసీ) ఫైనల్లో సగర్వంగా అడుగుపెట్టింది. ఇప్పటికే న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరగా, తాజాగా టీమిండియా తుది పోరుకు అర్హత సాధించింది. నాలుగో టెస్టులో 160 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 135 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియాకు ఇన్నింగ్స్ విజయం లభించింది. అక్షర్ పటేల్, అశ్విన్ చెరో 5 వికెట్లతో ఇంగ్లండ్ నడ్డి విరిచి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ను టీమిండియా 3-1తో కైవసం చేసుకుంది. జూన్‌లో‌ లార్డ్స్ వేదికగా జరగనున్న ఫైనల్లో న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడనుంది.
ఇక ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో స్టోక్స్(55 పరుగులు) మినహా మరెవరు రాణించలేకపోయారు. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఒక దశలో 143 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ స్కోరును సమం చేస్తుందా అన్న అనుమానం రేకెత్తించింది. అయితే పంత్- సుందర్‌ సెంచరీ భాగస్వామ్యం తర్వాత సుందర్- అక్షర్‌లు మరో సెంచరీ భాగస్వామ్యం సాధించడంతో టీమిండియా పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్ లో పంత్ సూపర్ సెంచరీ(101 పరుగులు).. సుందర్ 96 నాటౌట్.. అక్షర్ పటేల్ 43 పరుగులతో రాణించడంతో టీమిండియా 365 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 160 పరుగుల ఆధిక్యం సంపాదించినట్లయింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos